తెలుగు రాష్ట్రాలను పీడిస్తున్న జల వివాదం..! 'గోదారి' చూపుతుందా పరిష్కారం..!!
హైదరాబాద్/అమరావతి : గోదావరి నీటి మళ్లింపుపై తెలుగు రాష్ట్రాల నీటిపారుదలశాఖ ఉన్నతాధికారుల మధ్య మంగళవారం హైదరాబాద్లో జరిగిన భేటీలో రెండు ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు తమ వాదనలను వినిపించారు. ఈ ప్రతిపాదనలను ఓకొలిక్కి తెచ్చేందుకు మరింత లోతైన అధ్యయనం చేయాలని సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణలో రాంపూర్ నుంచి శ్రీశైలానికి, ఆంధ్రప్రదేశ్లో పోలవరం నుంచి నాగార్జునసాగర్కు నీటిని మళ్లించే పథకాల ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించారు. మొత్తం కాలువలు పొడవు, సొరంగ మార్గం పొడవు, నిర్మాణం కోసం సేకరించాల్సిన భూమి, అంచనా వ్యయం ఎంతవుతుందన్న అంశాలపై కసరత్తు జరపాలని అభిప్రాయపడ్డారు. గరిష్ఠంగా 400 టీఎంసీలు, కనిష్ఠంగా 300 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లించాల్సిన అవసరం ఉంటుందన్నారు.
Recommended Video
గోదారి మళ్లింపుపై లోతైన చర్చ..! తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ల సమావేశంలో నిర్ణయం..!!
రెండు పథకాలపై అధ్యయనం చేశాక ఈనెల 13 లేదా 15వ తేదీన మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. 15న ముఖ్యమంత్రుల సమావేశం ఉంటే 13న, లేదా 15న భేటీ అవుతారు. ముఖ్యమంత్రుల సమావేశం నాటికి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని నిశ్చయించారు. తెలంగాణ తరఫున ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీరు నరసింహారావు, విశ్రాంత ఇంజినీర్లు శ్యాంప్రసాద్రెడ్డి, వెంకటరామారావు, చంద్రమౌళి, సత్తిరెడ్డి, ఏపీ నుంచి జలవనరుల విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, హైడ్రాలజీ విభాగం, కర్నూలు ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు కుమార్, నారాయణరెడ్డి, సలహాదారు రోశయ్య, విశ్రాంత ఇంజినీర్లు రెహ్మాన్, రౌతు సత్యనారాయణ, సుబ్బారావు, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
వినూత్నంగా ఏపి బడ్జెట్ సమావేశాలు..! అందరికి అవకాశం ఇస్తామన్న ఏపి స్పీకర్..!!
నూతన ఎజెండా..! పలు కోణాల్లో పంపకాలపై కసరత్తు..!!
శ్రీశైలం, నాగార్జునసాగర్లలో రెండు రాష్ట్రాల అవసరాలు, గోదావరి నుంచి ఎంత నీటిని ఎక్కడి నుంచి మళ్లించాలి, దీనివల్ల బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఎదురయ్యే న్యాయసమస్యలు, ప్రతిపాదిత పథకాల సర్వే, నిర్మాణ వ్యయం, నిర్వహణ వ్యయం పంపకాలు, ఎగువ రాష్ట్రాలు వాటా కోరే అంశం, కేంద్రం తలపెట్టిన గోదావరి-కావేరి అనుసంధానం. గోదావరి నుంచి రోజూ సుమారు 50 వేల క్యూసెక్కులు మళ్లించడానికి ఎన్ని రోజులు అవకాశం ఉంటుందో చర్చించిన తర్వాత తెలంగాణ ఇంజినీర్లు అధ్యయనం చేసిన రాంపూర్ నుంచి శ్రీశైలానికి రెండు టీఎంసీలు మళ్లించే ప్రతిపాదనకు, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు అధ్యయనం చేసిన పోలవరం నుంచి పులిచింతల ద్వారా నాగార్జునసాగర్కు రెండు టీఎంసీలు మళ్లించే ప్రతిపాదనకు సూత్రప్రాయ అంగీకారం కుదిరింది.
ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం..! కసరత్తు చేస్తున్న అదికారులు..!!
ఈ పథకాలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి మళ్లీ సమావేశం కానున్నారు. ఈ రెండు ప్రతిపాదనలను కలిపితే సుమారు 650 కి.మీ దూరం కాలువలు, ఇతర పనులు చేపట్టాల్సి ఉంటుంది, వీటికి ఎంత ఖర్చవుతుంది, ఎంత భూమి సేకరించాలనే దానిపై తదుపరి సమావేశానికి వివరాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. రాంపూర్ నుంచి రోజూ మళ్లించే రెండు టీఎంసీల నీటిని మార్గమధ్యంలో 0.7 టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ, దిండి, సాగర్ ఎడమకాలువ తదితర అవసరాలకు వినియోగించుకొని 1.3 టీఎంసీ నీటిని శ్రీశైలానికి మళ్లించాలన్నది ప్రతిపాదనగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ నెల 13 లేదా 15వ తేదీన మళ్లీ భేటీ..! కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఇంజనీర్లు..!!
శ్రీశైలానికి తీసుకెళ్లి వెనక్కు తేవడం కంటే మార్గమధ్యంలో ఆయకట్టుకు సరఫరా చేయడం మంచిదని ఇలా ప్రతిపాదించినట్లు వెల్లడించాయి. పోలవరం నుంచి మళ్లించే నీటిలో కూడా మార్గమధ్యంలో నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టుకు, సోమశిలకు కొంత నీటిని మళ్లించి మిగిలినవి నాగార్జునసాగర్కు తేనున్నారు. శ్రీశైలానికి వచ్చే నీటిలో ఎక్కువ భాగం రాయలసీమ, మహబూబ్నగర్, నల్గొండలకు వినియోగించుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని రెండు రాష్ట్రాల ఇంజినీర్లు అభిప్రాయపడినట్లు తెలిసింది. కృష్ణా బేసిన్లో రెండు రాష్ట్రాలకు ఉన్న మొత్తం అవసరాలు 1300 టీఎంసీలని అభిప్రాయపడినట్లు సమాచారం. గోదావరి నుంచి మళ్లించే నీటిలో చెరిసగం వాడుకోవడం, నిర్మాణ వ్యయాన్ని కూడా సమానంగా భరించడం గురించి చర్చించినట్లు తెలియవచ్చింది.