అసలు చంద్రబాబు రెక్కలు ఉన్న పక్షేనా..: ఒకరు చేసినది తన క్రెడిట్లోకి..!!
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కాలంలోనూ తమ ప్రభుత్వం జల యజ్ఞాన్ని కొనసాగించిందని, ప్రాజెక్టుల నిర్మణాన్ని పరుగులు పెట్టించిందని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధాన్యత ఇచ్చామని, అందుకే సంగం బ్యారేజీ రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుందని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ను గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
చంద్రబాబు రెక్కల కష్టమా?
కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా ఉన్నప్పటికీ- ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేసిందని, వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అవన్నీ తమవల్లే పూర్తయ్యాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకొంటోన్నారని విమర్శించారు. చంద్రబాబు రెక్కల కష్టంతో సంగం బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసుకుందని, దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి రబ్బన్ కంటిగ్ చేశారని ఓ టీడీపీ నాయకుడు చెప్పడం ఆయన్ అజ్ఞానాన్ని సూచిస్తోందని ఎద్దేవా చేశారు.
అబద్ధం చెప్పినా..
అబద్ధం చెప్పినా కాస్త అతికినట్టు, వాస్తవానికి దగ్గరగా ఉండాలని అంబటి రాంబాబు చురకలు అంటించారు. అబద్ధాలు, అవాస్తవాలను తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటోన్నారని విమర్శించారు. ఇలా చెప్పుకోవడానికి కాస్తంత సిగ్గయినా ఉండాలి లేదా ఆలోచనైనా ఉండాలని, టీడీపీ నాయకులకు ఈ రెండూ లేవని అంబటి కౌంటర్ అటాక్ చేశారు. ఏదో ఒకరకంగా ప్రచారం చేసుకుని, దాని వల్ల వచ్చే క్రెడిట్ను పొందడానికి ప్రయత్నిస్తోన్నారని ఆరోపించారు.
సంగం బ్యారేజీ వ్యయంపై..
మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ మొత్తం నిర్మాణ వ్యయం 335.08 కోట్ల రూపాయలు కాగా.. అందులో రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 30.85 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని వివరించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం 86.05 కోట్ల రూపాయలను వ్యయం చేసిందని గుర్తు చేశారు. అనంతరం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్.. తన మూడేళ్ల పరిపాలనలో 131 కోట్ల రూపాయలను వ్యయం చేశారని, ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారని అంబటి అన్నారు.
రెక్కలు ఉన్న పక్షేనా?
దీన్ని బట్టి చూస్తే మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం ఎవరి రెక్కల కష్టం అనేది స్పష్టమైతోందని ఆయన చెప్పారు. చంద్రబాబుకు అసలు రెక్కలే లేవని ఎద్దేవా చేశారు. ఆయన రెక్కలు ఉన్న పక్షేనా? అని ప్రశ్నించారు. రెక్కలు ఉన్నా ఆయన స్వయంగా ఎగరగలుగుతాడా? అని నిలదీశారు. చంద్రబాబు రెక్కల్లేని ఓ అక్కుపక్షిగా విమర్శించారు. చంద్రబాబు ఎగరాలంటే ఎవరో ఒకరి రెక్కలు కావాల్సిందేనని చురకలు అంటించారు. సీపీఎం, బీజేపీ, పవన్ కల్యాణ్ రెక్కలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎవరో ఏదో చేస్తే-
చంద్రబాబు 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారని, తన హయాంలో ఒక్క నీటి ప్రాజెక్ట్ను కట్టలేదని అంబటి రాంబాబు విమర్శించారు. తన హయాంలో కనీసం రైతాంగానికి నీటి సౌకర్యాన్ని కల్పించాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటోన్న ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టినవేనని గుర్తు చేశారు. ఎవరో ఏదో చేస్తే- తన ఘనతగా చంద్రబాబు చెప్పుకొంటోన్నాడని మండిపడ్డారు.