పోలవరంపై ప్రత్యేక వెబ్సైట్: పారదర్శకత కోసమేనంటోన్న మంత్రి: అందుబాటులో పూర్తి సమాచారం..!
అమరావతి: జాతీయ ప్రాజెక్టు పోలవరంపై రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ను జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన ఈ వెబ్సైట్ను లాంచ్ చేశారు. ఏపీకి గుెండెకాయగా చెప్పుకొనే భారీ నీటి పారుదల ప్రాజెక్టయిన పోలవరం నిర్మాణం, నిధుల కేటాయింపు వంటి ప్రతి అంశాన్ని కూడా ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీలో కూడా అనుమతులు లేకుండా?: నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కేంద్రం నుంచి మంజూరు అవుతోన్న నిధులు, వాటిని ఏఏ విభాగాల పనుల కోసం ఖర్చు చేస్తున్నారు? ఏ రోజు ఎంత మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి? వంటి ప్రతి అంశాన్ని కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచనున్నారు. ఫలితంగా- పారదర్శకత ఏర్పడుతుందని, అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చవకబారు విమర్శలు చేస్తున్నారని, ఫలితంగా ప్రజల్లో అనుమానాలు, అపోహలు వ్యక్తమౌతున్నాయని మంత్రి చెప్పారు.
ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ కింద ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించామని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అంచనాలను పెంచి, కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. అలాంటి పరిస్థితిని రానివ్వబోమని చెప్పారు. పారదర్శకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తామని, ప్రభుత్వం చేసే ప్రతి రూపాయిని కూడా ఇందులో పొందుపరుస్తామని అన్నారు.