చాలా మంది టచ్లో, రాజ్యసభ ఎన్నికలపై అధిష్టానానిదే తుది నిర్ణయం: సోము వీర్రాజు
అమరావతి: టిడిపి సహ ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు బిజెపిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్రంలో స్వంతంగా బలపడాలని ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది.
ఏపీ రాష్ట్రంలో బలపడాలని బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రత్యేక హోదా అంశం వ్యవహరం బిజెపికి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ఇబ్బందులను తెచ్చి పెట్టింది. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రానికి ఏ మేరకు సహయం చేశామనే విషయమై ప్రజలకు వివరించాలని బిజెపి నిర్ణయం తీసుకొంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఈ రెండు తెలుగు రాష్ట్రాలపై బిజెపి కేంద్రీకరించి పనిచేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వేరే పార్టీల నేతలు టచ్లో ఉన్నారు
ఇతర పార్టీలకు చెందిన నేతలు తమతో టచ్లో ఉన్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. రాజకీయంగా బలోపేతం కావడానికి బిజెపి కూడ వ్యూహ రచన చేస్తోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున బిజెపితో కొందరు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. అన్నీ అనుకొన్నట్టుగా జరిగితే త్వరలోనే కొందరు నేతలు ఆయా పార్టీలను వీడి బిజెపిలో చేరుతారని సోము వీర్రాజు ప్రకటించారు.

కోర్ కమిటీలో కూడ చర్చ
ఏపీ రాష్ట్రంలోని పలు పార్టీల నుండి బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపే వారిని బిజెపిలో చేర్చుకోవాలని బిజెపి కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఆదివారం నాడు విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏ పార్టీ నుండి ఎవరెవరు బిజెపిలో చేరే అవకాశం ఉందనే విషయమై కూడ చర్చించారు. పార్టీలో చేరేందుకు వచ్చేవారిని చేర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. టిడిపికి రాజీనామా చేసిన సినీ నటి కవిత ఆదివారం నాడు బిజెపిలో చేరారు.

రాజ్యసభ ఎన్నికల్లో మద్దతెవరికీ
రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే విషయమై బిజెపి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయమై బిజెపి జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు బిజెపి నేతలు చెబుతున్నారు.ఈ విషయమై పార్టీ జాతీయ నాయకత్వం నుండి ఆదేశాల ప్రకారం నడుచుకొంటామని సోము వీర్రాజు చెప్పారు.

రాజకీయంగా బలపడాలి
రాజకీయంగా ఏపీలో బలపడేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏపీ రాష్ట్రానికి చేసిన సహయంపై ప్రచారం చేయాలని కోర్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకొంది.












Click it and Unblock the Notifications