నో అనేది వినేందుకు సిద్ధంగా లేం: ప్రత్యేక హోదాపై పరకాల
న్యూఢిల్లీ: తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి నో అనే సమాధానం వినేందుకు తాము సిద్ధంగా లేమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
విభజన సందర్భంగా ఏపీకి చట్టంలోను, రాజ్యసభ చర్చలోను, నాటి ప్రధాని ప్రకటనలోనూ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని, ఇంతకు మించి తామేమీ కోరటం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సహా అన్ని హామీలు అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్రమంత్రులు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మోడీ, జైట్లీలపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని చెబుతూ పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చే వరకూ ఏపీకి కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి నచ్చజెబుతామని, ఒత్తిడి తెస్తామని, ఎలాగైనా హోదా అమలయ్యేలా చూస్తామన్నారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఎంతో శాస్త్రీయంగా సర్వే చేశామని, దీన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications