నీచంగా ఆలోచించం, ఏపీ మంత్రులపై నిఘా పెట్టిందే బాబు: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందన్న ఆరోపణల పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం స్పందించారు. ఏపీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అసలు ఏపీ మంత్రుల పైన నిఘా పెట్టిందే చంద్రబాబు అన్నారు.
ఆయనంత నీచంగా తాము ఆలోచించబోమని చెప్పారు. చంద్రబాబు చరిత్ర ఏమిటో అందరికీ తెలుసునని చెప్పారు. రేవంత్ రెడ్డి పక్కా ఆధారాలతో పట్టుబడినా నిర్దోషి అని టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. కళ్లముందు జరిగిన దాని పైన కట్టుకథలు చెప్పే ప్రయత్నం తెలంగాణ టీడీపీ చేస్తోందన్నారు.

తెలుగుదేశం పార్టీలాగా దిక్కుమాలిన పని తాము చేయమన్నారు. చంద్రబాబు సొంత కేబినెట్ మంత్రుల పైనే నిఘా పెట్టారన్నారు. వాళ్లలా బుద్ధిలేని పనులు చేయమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఓటు వేయడం కూడా చేతకాదన్నారు. తమది బాధ్యత గల ప్రభుత్వమని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలాగా చిల్లర రాజకీయాలు చేయమని చెప్పారు. రేవంత్ రెడ్డి చిన్న పిల్లవాడు ఏమీ కాదని చెప్పారు. రాజకీయాల్లోకి డబ్బు సంస్కృతిని తీసుకు వచ్చిందే చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. రేవంత్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం హోంమంత్రికి ఉంటుందన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై మాట్లాడుతూ.. ఆదివారం నాడు 5,500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిజాం కళాశాల, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ పైన ర్యాలీలు ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications