కాపు రిజర్వేషన్ సెన్సిటివ్, టిడిపితో పొత్తుపై కాలమే నిర్ణయం: సోము వీర్రాజు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తాము పూర్తి సహయ సహకారాలు అందిస్తామని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదనేది తమ అభిమతమన్నారు. టిడిపితో పొత్తు విషయమై కాలమే నిర్ణయిస్తోందన్నారు.
ఏపీ రాష్ట్రంలో బిజెపి, టిడిపి మద్య ఇటీవల కాలంలో మాటల యుద్దం సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖ విషయమై ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తోంటే అడ్డుపుల్లలు వేయడంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బిజెపి నేతలు కూడ ఈ విషయమై టిడిపి తీరును తప్పుబట్టారు. ఓ తెలుగు న్యూస్ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సోము వీర్రాజు ఏపీలో చోటు చేసుకొన్న పలు అంశాలపై స్పందించారు.
పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తాం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బిజెపి అడ్డుపడడం లేదని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేదే తమ అభిమతమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసినందుకు తాము సహకరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోబోమని చెప్పారు.
కాపు రిజర్వేషన్లపై చర్చిస్తాం
కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మాణానికి తమ పార్టీ స్వాగతం పలికిన విషయాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం కేంద్రం కోర్టులో ఉంది. ఈ విషయమై ఏం చేయాలనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సోము వీర్రాజు చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశం చాలా సెన్సిటివ్ అంశమని చెప్పారు.
టిడిపితో పొత్తుపై కాలమే నిర్ణయిస్తోంది
టిడిపితో తాము ఇప్పటివరకు మిత్రపక్షంగానే ఉన్నామని సోము వీర్రాజు చెప్పారు. అయితే రేపు ఏం జరుగుతోందోననే విషయాన్ని కాలమే నిర్ణయిస్తోందని సోము వీర్రాజు చెప్పారు.అయితే తాము టిడిపితో పొత్తును కొనసాగిస్తారా, కటీఫ్ చేసుకొంటారా అనే విషయమై ఎమ్మెల్సీ సోము వీర్రాజు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.అయితే పొత్తు కొనసాగుతోందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు.
బలోపేతం చేయడానికి ప్రయత్నాలు
స్వతంత్రంగా బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తుంటారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. టిడిపి కూడ అదే తరహలో ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. మరో వైపు తాము కూడ స్వతహగా ఏపీలో బలోపేతం కావాలని కోరుకొంటున్నామని చెప్పారు. ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.అయితే ఈ మేరకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మా ఆలోచనలు మాకున్నాయని ఆయన చెప్పారు.