సమైక్యమే: గంటా, ఓయులో రాళ్ల వర్షం, బాష్పవాయువు
విశాఖ/హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరగదని మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం విశాఖలో అన్నారు. ఆయన ఉదయం విలేకరులతో మాట్లాడారు. తాము ఇప్పటికీ సమైక్యాంధ్రనే కోరుకుంటున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి తనను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి కోసమే: యనమల
కాంగ్రెసు పార్టీ రాజకీయ లబ్ధి కోసమే రాయల తెలంగాణను తెరపైకి తీసుకు వచ్చిందని టిడిపి సీనియర్ నేత, శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు హైదరాబాదులో అన్నారు. విభజనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోందన్నారు. తెలంగాణతో లాభమా, రాయల టితో లాభమా అని బేరీజు వేసుకుంటోందని ధ్వజమెత్తారు. కేబినెట్ నోట్ చూశాక తాము స్పందిస్తామన్నారు. కేంద్రం రాజకీయ పార్టీలతో పది జిల్లాల తెలంగాణ పైన మాత్రమే చర్చించిందన్నారు.
ఓయులో ఉద్రిక్తత
రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు భారీగా ర్యాలీతో బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు బారీకేడ్లు, గేట్లు మూసి వారిని అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించడంతో రెండుసార్లు బాష్పవాయువును ప్రయోగించారు.
సోనియాను కలిసిన టి ఎంపీలు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని, రాయల తెలంగాణ వద్దని వారు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు రేపటికి వయిదా పడిన అనంతరం టి ఎంపీలు సోనియాను కలిశారు.