పార్టీ మనల్ని మరిచినా: కిరణ్, పిఎం పర్యటనకు ముందే
హైదరాబాద్/న్యూఢిల్లీ: పార్టీ మనల్ని మరిచిపోయినా, మనం పార్టీని మరిచిపోలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం తనను కలిసిన సీమాంధ్ర మంత్రులతో అన్నట్లుగా తెలుస్తోంది. మినిస్టర్స్ క్వార్టర్సులో భేటీ అనంతరం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు కిరణ్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
పార్టీ మనల్ని మరిచిపోయినా, మనం పార్టీని మరిచిపోలేదని అన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అంతిమ విజయం మనదేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ నోట్ అసెంబ్లీ తీర్మానం కోసం వస్తే ఓడించి పంపుదామని వారితో చెప్పారు. రాజీనామా వంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అలా చేస్తే విభజన ప్రక్రియ సులువు అవుతుందని చెప్పారు.
ప్రధాని విదేశీ పర్యటనకు ముందే కేబినెట్ ఆమోదం
మరోవైపు తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ నెల 9వ తేదిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి నుండి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వీరి విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆ లోపే కేబినెట్లో తెలంగాణ నోట్ ఆమోదం పొందే వ్యూహంతో అధిష్టానం ముందుకు వెళ్తోందంటున్నారు.