సవాల్ స్వీకరించాం.. పవన్ మాట నిలబెట్టుకుంటారో లేదో చూస్తాం: ఎంపీ మేకపాటి
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం కోసం పార్లమెంట్ సెక్రెటరీకి నోటీసు ఇచ్చామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. సభ నిరవధిక వాయిదా పడగానే రాజీనామా చేస్తామని ఆయన వెల్లడించారు.
గురువారం ఢిల్లీలో మీడియాతో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. అవిశ్వాసంపై చర్చకు 54 మంది సభ్యుల మద్దతు అవసరమన్నారు.
'అవిశ్వాసం పెట్టండి.. 50 మంది ఎంపీల మద్దతు ఇప్పిస్తామని ఎవరో సవాల్ చేశారు... ఆ సవాల్ మేరకు అవిశ్వాసం పెడుతున్నాం. సవాల్ చేసిన వారు మద్దతు కూడగడతారో లేదో చూడాలి..' అంటూ జనసేన అధినేత పవన్ చేసిన సవాల్ను పరోక్షంగా ప్రస్తావించారు ఎంపీ మేకపాటి.
అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిందిగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి మద్దతు కోరామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తాము ప్రవేశపెట్టే అవిశ్వాసానికి టీడీపీ ఎంపీలు మద్దతు ఇస్తారనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.