సమైక్యవాది ఆదాలను గెలిపించుకుంటాం: జెసి దివాకర్
హైదరాబాద్: సమైక్యవాదానికి వినిపించడానికే ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యవాదం వినిపిస్తున్న వారినే తాము గెలిపించుకుంటామని తెలిపారు. అదే సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీతో కాంగ్రెస్ వారు ఎవరూ ఓడిపోరని అన్నారు.
తాము గత ఏడాది కాలం నుంచే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నామని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. సమైక్యవాదాన్ని వదలబోమని ఆయన తెలిపారు. సమైక్యవాదుల జోలికి కూడా వెళ్లబోమని ఆయన అన్నారు. నిజమైన సమైక్యవాదులకు ఓటేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ నాలుగో అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో బరిలో దింపకుండా తప్పు చేసిందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తాము సీటు కోసం కాదని, సమైక్యవాదం కోసం పోరాడుతున్నామని చెప్పారు. అశోక్ బాబు సమైక్య వాదాన్ని బలపరిచే వ్యక్తి మాత్రమేనని, అభ్యర్థి కాదని ఆయన చెప్పారు.
సమైక్యత కోసం తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితోపాటు ఎవర్నైనా కలుస్తామని చెప్పారు. సమైక్యవాదులు ఎవరూ ఓడిపోరని జెసి తెలిపారు. ఇటీవల రాజ్యసభకు తనను గెలిపిస్తే వోల్వో బస్సు ఇస్తారని చెప్పారు కదా అని మీడియా ప్రశ్నించగా.. ఏదో మాట వరసకు అన్నందుకు దాన్ని మీరే రాద్ధాంతం చేశారని జెసి మీడియాతో అన్నారు.
ముఖ్యమంత్రితో సీమాంధ్ర మంత్రుల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, రఘువీరా రెడ్డి, పార్థసారథి, శత్రుచర్ల విజయ రామరాజులు శనివారం భేటీ అయ్యారు. వీరితోపాటు ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి కూడా భేటీలో ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలు, తెలంగాణ అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.