ఏపీ కరోనా కేసుల్లో న్యూ ట్రెండ్: 11 ఏళ్లలోపు పిల్లల్లో..కొత్త వ్యాధులు, కొత్త ఇన్ఫెక్షన్లు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల్లో ఓ కొత్త ట్రెండ్ ఏర్పడిందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించిన వారిలో 11 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందడంలో ఇది న్యూ ట్రెండ్గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి కేసుల్లో సరికొత్త వ్యాధులు, ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ న్యూ ట్రెండ్ గురించి ఆరా తీస్తున్నామని ఆయన అన్నారు. కొత్తగా తలెత్తిన ఈ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచనలను పాటిస్తున్నామని అన్నారు.
Recommended Video
కొత్త ఇన్ఫెక్షన్పై అప్రమత్తం..
ఇన్ఫెక్షన్ ప్రభావం ఎంత వరకు ఉంటుంది? దాని లక్షణాలు ఏమిటనే విషయంపై తాము ఐసీఎంఆర్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నామని జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటిదాకా ఆ పిల్లలకు ఐసీఎంఆర్ జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే వైద్య చికిత్సను అందిస్తున్నామని అన్నారు. కరోనాా వైరస్ పాజిటివ్గా తేలిన పేషెంట్లకు అందించే వైద్య విధానాన్నే ఆ పిల్లల విషయంలో అనుసరిస్తున్నామని తెలిపారు. ట్రీట్మెంట్, ప్రొటోకాల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు. ఐసీఎంఆర్ ఏవైనా కొత్త మార్గదర్శకాలను సూచిస్తే.. దాన్ని అనుసరిస్తామని జవహర్ రెడ్డి చెప్పారు.
పరిమితంగా 11 ఏళ్లలోపు పిల్లల సంఖ్య..
కరోనా వైరస్ బారిన పడిన 11 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య పరిమితంగానే ఉంది. గుంటూరులోని కుమ్మరి బజార్లో నలుగురు, ఆనందపేటలో ఇద్దరు, అరుండల్ పేటలో ముగ్గురు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒకరు, కర్నూలులోని గనిగల్లి వీధిలో ఒకరు, హబీబఓ ముబారక్ నగర్లో ఇద్దరు, నెల్లూరు జిల్లా నాయుడుపేట బడీ కాలనీలో ఒకరు, అదే జిల్లాలోని తిరుమూరులో మరో బాలుడు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో ఇద్దరు, విజయవాడ విద్యాధరపురంలో ముగ్గురు, అనంతపురం లేపాక్షిలో ఒకరు ఉన్నారు. వారంతా 3 నుంచి 11 సంవత్సరాలలోపు పిల్లలే. లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడి సహా కొందరు డిశ్చార్జి అయ్యారు.
కుటుంబ నేపథ్యంపై ఆరా
11 సంవత్సరాల లోపు పిల్లల్లో కనిపిస్తోన్న ఈ కొత్త వ్యాధి, ఇన్ఫెక్షన్ గురించి పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించే పనిలో పడింది. ఈ లక్షణాలు కనిపించిన పిల్లల వివరాలు, కుటుంబ నేపథ్యం, ట్రావెలింగ్ హిస్టరీ వంటి సమాచారాన్ని ఐసీఎంఆర్కు పంపించింది. ప్రస్తుతానికి కరోనా వైరస్ పేషెంట్లకు అందజేస్తోన్న వైద్య చికిత్స విధానాన్నే వారికీ వర్తింప జేస్తున్నారు. దీని అనంతరం ఐసీఎంఆర్ నుంచి సూచనలు, సలహలను అనుసరిస్తారు. ఐసీఎంఆర్ సూచలన మేరకు ఆయా పిల్లలకు కరోనా వైద్యాన్ని కొనసాగించాల్సి ఉంటుందా? లేదా మార్పులు చేయాల్సి ఉంటుందా? అనే విషయాన్ని నిర్ణయిస్తారు.