మాకు ఐఎన్ఎస్ యుద్ధనౌక ఇవ్వండి: కేంద్రానికి చంద్రబాబు లేఖ
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ కాలంపాటు సేవలందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్. 30ఏళ్లుగా సేవలందిస్తున్న దీని జీవితకాలం వచ్చే సంవత్సరం(2016)తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఐఎన్ఎస్ విరాట్ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు కోరారు.
కాకినాడ వద్ద సముద్రంలో ఈ యుద్ధనౌకను నిలిపి ‘తేలియాడే మ్యూజియం'గా వాడుతూ, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని ఆయన ప్రతిపాదించారు. విశాఖపట్నం వద్ద సబ్ మెరైన్ మ్యూజియం ఉన్నట్లుగానే, కాకినాడ వద్ద వార్షిప్ మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నది తమ ఉద్దేశమని, ఐఎన్ఎస్ విరాట్ను తమకు అప్పగించాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారు.
విరాట్ కన్నా ముందుగా సేవలందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను 1997లో తుక్కుగా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో విక్రాంత్ను సైతం కాపాడాలని కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఐఎన్ఎస్ విక్రాంత్కు పట్టిన గతిని విరాట్కు పట్టనివ్వకూడదని భారత నౌకాదళం సైతం భావిస్తుండటంతో.. చంద్రబాబు కోరిక తీరి కాకినాడ తీరం మరో ఆకర్షణీయ ప్రాంతం అవుతుందని ఆకాంక్షిస్తున్నారు.