Badvel bypoll: గెలుపు గుర్రాన్ని నిలబెడతాం: సోము వీర్రాజు: పవన్ కల్యాణ్ ఉసు లేని భేటీ
కడప: కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నికలో తాము పోటీ చేయబోతున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని అన్నారు. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టామని పేర్కొన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులతో పూర్తిస్థాయిలో సంప్రదింపులను నిర్వహించిన తరువాత అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

గెలుపు గుర్రాన్ని నిలబెడతాం..
జిల్లాస్థాయి నాయకులతో పాటు- నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న అభ్యర్థిని నిలుపుతామని అన్నారు. బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో- సోము వీర్రాజు కడప జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బద్వేలు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామని తేల్చి చెప్పారు. విజయం సాధించడానికి అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తామని చెప్పారు. అభ్యర్థిని గెలిపించుకునే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని అన్నారు.

వారసత్వ రాజకీయాలకు విరుద్ధం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథ్యంలోని అధికార పార్టీ బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని సోము వీర్రాజు అన్నారు. దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్యను వైఎస్సార్సీపీ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వానికి స్థానం లేదని అన్నారు. వారసత్వ రాజకీయాలను తాము ప్రోత్సహించట్లేదని స్పష్టం చేశారు. బద్వేలు ఉప ఎన్నిక కోసం పార్టీ ఒక్క నాయకుడు, కార్యకర్త, కష్టపడి పని చేయాలని సూచించారు.

ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందే..
రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి నాయకత్వం వరకు అందరూ ఈ ఎన్నిక కోసం సిద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేశారని అన్నారు. ఈ విషయాన్ని తాము గ్రామగ్రామానికీ తీసుకెళ్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, అది జగన్ సర్కార్ ఘనత ఎంత మాత్రమూ కాదని సోము వీర్రాజు అన్నారు.

స్టిక్కర్ల సర్కార్కు
రాష్ట్రంలో ఈ ఏడు సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తమ సవాల్ను ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్వీకరించాలని, చర్చకు సిద్ధం కావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు జగన్ సర్కార్ పేర్లు మార్చుతోందని, స్టిక్కర్లను అతికిస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు.

జనసేన తప్పుకొన్నా..
బద్వేలు ఉప ఎన్నికలో తాము పోటీ చేయట్లేదంటూ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఇదివరకే ప్రకటించింది. బీజేపీ-జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ- కొంత కాలంగా ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండట్లేదని అంటున్నారు. అందుకే- జనసేన మద్దతు ఉన్నా, లేకపోయినా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒంటరిగా సత్తా చాటాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారా? లేదా? అనేది కూడా అనుమానమే.

తిరుపతిలో చేతులు కాల్చుకున్న బీజేపీ-జనసేన
కొద్దినెలల ముందే ముగిసిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేశాయి. బీజేపీ నాయకులు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నెలల తరబడి తిరుపతిలో మకాం వేసి, అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. పవన్ కల్యాణ్ సైతం తిరుపతిలో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. అయినప్పటికీ- ఈ ఎన్నిక ఫలితం ఏ మాత్రం ఆశాజనకంగా రాలేదు. 60 వేల ఓట్లు కూడా పోల్ కాలేదు బీజేపీకి. అవే తరహా ఫలితాలు ఇక్కడా పునరావృతం కాకుండా బీజేపీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications