2019లో ప్రభుత్వం ఏర్పాటు, జనసేన వల్లే టిడిపికి పవర్, కన్నీళ్ళు తుడవని అనుభవమెందుకు: పవన్
Recommended Video

శ్రీకాకుళం: 2014లో జనసేన వల్లే ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలను పరిష్కరించలేనందున ప్రజల తరుపున ప్రశ్నించేందుకే తాను ప్రజలతో కలిసి తిరుగుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గలో ప్రత్యేక హోదా కవాతులో మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టిడిపిపై వపన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.
2014 ఎన్నికల్లో ఇచ్చిన హమీ ప్రకారంగానే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీలను విస్మరించాయని ఆయన విమర్శలు గుప్పించారు.

టిడిపికి అధికారంలోకి రావడానికి జనసేన కారణం
2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి జనసేన పార్టీయే కారణమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమీలను విస్మరించాయని ఆయన విమర్శించారు. చట్టసభల్లో కూర్చొన్న నేతలు తమ ప్రయోజనాలను కాపాడుకొంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రభుత్వాలు మాట నిలుపుకోలేదన్నారు. ఈ మాటను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
2019 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడమే కాకుండా ఎన్నికల్లో ప్రతి ఒక్కరితో జనసేనకు ఓటు చేయిస్తే తాను సీఎం అవుతానని చెప్పారు. 2019 లో ఏపీ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. అయితే జనసైనికులు గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.బిజెపిని నిలదీసిన చరిత్ర తమదేనన్నారు. చంద్రబాబునాయుడు బిజెపిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.

మీ అనుభవం ఎందుకు
40 ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయితే ప్రజల సమస్యలు తీర్చలేని చంద్రబాబుకు అనుభవం ఉంటే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల కన్నీళ్ళు రాకుండా చేస్తామని చెప్పారు.

మీరేం చేస్తున్నారు, వైసీపీపై ఇలా
వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గుండాయిజం, రౌడీయిజం, భూ కబ్జాలు పెరిగిపోతాయని టిడిపి నేతలు 2014 ఎన్నికల సమయంలో ప్రచారం చేశారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. కానీ, టిడిపి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. టిడిపి నేతలే భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పలాస ప్రాంతంలో స్థానికులు అల్లుడు ట్యాక్స్ ను కట్టాల్సి వస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications