పార్టీలతో కలిసి ఢిల్లీ వెళ్తామన్న బొత్స: సిఎంకు పిలుపు
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉన్న అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులను కలుపుకుని మంగళవారం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన్మోహన్తోపాటు జాతీయ పార్టీల నేతలను కలుస్తామని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన నివాసంలో అందుబాటులో ఉన్న సీమాంధ్ర మంత్రులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమైక్యతే తమకు ముఖ్యమని అన్నారు.
మంగళవారం పార్లమెంటులో విభజన బిల్లుపై చర్చ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బొత్స సీమాంధ్ర మంత్రులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న సున్నితమైన విభజన అంశంపై సమావేశంలో చర్చించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామాలు చేయడం, కొత్త పార్టీల ఆలోచనలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి అంశాలు ప్రాధాన్యత లేనివని ఆయన అన్నారు. వాటితో ప్రయోజనం కూడా ఉండదని అన్నారు. కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నానని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ నిర్వహించిన సమావేశానికి తనను పిలువలేదని బొత్స చెప్పారు.
సీమాంధ్ర నాయకులందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న పార్టీ అధ్యక్షులకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డితోపాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర నేత రాఘవులుకు లేఖలు రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సమైక్యంధ్రను కోరుకుంటున్న అన్ని పార్టీల సీమాంధ్ర నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితోపాటు అన్ని జాతీయ పార్టీల నాయకులను కలువాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో ఈ అంశాలను పేర్కొన్నట్లు తెలిపారు. విభజన అంశానికి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అందరం కలిసి ఆఖరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోపాటు జాతీయ పార్టీల నాయకులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరనున్నట్లు తెలిపారు.
మంగళవారం ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులతోపాటు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలతో భేటీ అవుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలుస్తామని చెప్పారు.
ఏదో రాజకీయ లబ్ధి కోసం సమావేశం కాలేదని చెప్పిన బొత్స సత్యనారాయణ, సమైక్య రాష్ట్రాన్ని సాధించే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఇతర మంత్రులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications