వంద నోటీసులిచ్చినా...: అచ్చెన్నాయుడు, గవర్నర్పై తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తాము పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. హైదరాబాదులో 45 బెటాలియన్ల ఎపి పోలీసులను ఉంచామని ఆయన చెప్పారు. తమ పోలీసులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం చేస్తూ, తమపైనే తప్పుడు కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు.
తమకు తమ పోలీసులనే ఉపయోగించుకుంటామని, హైదరాబాద్లో తమ పరిపాలనను తామే సాగిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులో పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చామని ఆయన చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఒకటి కాదు వంద నోటీసులు ఇచ్చినా తాము పట్టించుకోబోమని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయించిందని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయించుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలన్న తమ సవాల్ను ఎందుకు స్వీకరించలేదని ఆయన అడిగారు.
రేవంత్ రెడ్డిని అరెస్టు చేయక ముందే ఈసికి తెలియజేశామని తెలంగాణ ఎసిబి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాతనే ఈసికి తెలియజేసిందని ఆయన అన్నారు. ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అప్రతిష్టపాలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని ఆయన అన్నారు.
గవర్నర్ నరసింహన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 8పై మార్గదర్శకాలు రాలేదని గవర్నర్ కుంటిసాకులు చెబుతున్నారని ఆయన అన్నారు. గవర్నర్ది రాజ్యాంగ పదవి అని, ఈ విషయంపై స్పందించాలని ఆయన అన్నారు.
గవర్నర్ కుంటిసాకులు చెబుతున్నారని, గంగిరెద్దులా తల ఊపుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తన విధి నిర్వహించడం లేదని, పదవిలో కొనసాగడం రాజ్యాంగానికే నష్టమని ఆయన అన్నారు.
అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని మంత్రి అన్నారు. తాము అల్లాటప్పాగా మాట్లాడడం లేదని, తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఇవ్వవద్దని కొన్ని సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు. ఏయే నెంబర్లను ట్యాప్ చేశారో ఆ వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రూ.6823 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మెట్రో రైలు ప్రాజెక్టులో రెండు కారిడార్లు, 25 స్టేషన్లు వుంటాయని తెలిపారు.
అమరావతికి మెట్రో రైలు లింక్ వుంటుందని చెప్పారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మొదటి కారిడార్లో 12 స్టేషన్లు, రెండో కారిడార్లో 13 స్టేషన్లు వుంటాయన్నారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు 31.20 హెక్టార్ల భూమి అవసరమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.866 కోట్లు అని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధాన మంత్రులను అహ్వానించినట్లు చెప్పారు.