సీక్రెట్తో కుట్ర: టీఆర్ఎస్పై డిఎస్, జాగ్రత్తలని ఏపీ మంత్రి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మండలి కాంగ్రెస్ పక్ష నేత డి శ్రీనివాస్ మంగళవారం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులకు తాము విప్ జారీ చేస్తామని చెప్పారు. మండలి చైర్మన్ ఎన్నిక విషయంలో తెరాస ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తోందని మండిపడ్డారు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టి కుట్ర చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనకు కూడా తమకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. చైర్మన్ ఎన్నిక విషయంలో సంప్రదాయం పాటించాలన్నారు. కాంగ్రెసు పార్టీ తరఫున మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఫరూక్ హుస్సేన్ మాట్లాడుతూ... తాను మచ్చలేని మైనార్టీ నేతను అని చెప్పారు. కాంగ్రెసు ఎమ్మెల్సీల ఇళ్లకు వెళ్లి తనను గెలిపించాలని కోరుతానని చెప్పారు.
రాజకీయ ఎత్తుగడలు: షబ్బీర్ అలీ
తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక కోసం తెరాస రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతోందని, సీక్రెట్ బ్యాలెట్ పద్దతిని అమలు చేయాలని చూస్తోందని మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. రాష్ట్రంలో కరువు సహా చాలా సమస్యలు ఉన్నాయని వాటిపై చర్చించడం మాని మండలి పదవి కోసం ఈ హడావుడి సమావేశాలు తెరాస దేనికోసం నిర్వహిస్తోందని ప్రశ్నించారు.
గెయిల్ నిర్లక్ష్యం వల్లే: చినరాజప్ప
గెయిల్ నిర్లక్ష్యం వల్లే తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హోంమంత్రి చినరాజప్ప మంగళవారం చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
తెరుచుకున్న బాబ్లీ గేట్లు
బాబ్లీ గేట్లను అధికారులు తెరిచారు. వివాదాస్పదమైన బాబ్లీ గేట్లు మంగళవారం తెర్చుకున్నాయి. బాబ్లీ నిర్మాణం అక్రమం అంటూ గతంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన కోర్టు ఏటా అక్టోబర్ 29 నుండి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లను మూసివేసి ఉంచాలని, జూలై 1న తెరిచి అక్టోబర్ 28న నది ప్రవాహానికి ఆటంకం కలగకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో బాబ్లీ గేట్లను ఎత్తారు.
కాగా, ప్రకాశం బ్యారేజీకి 0.67 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుందని, ఈ విషయాన్ని తాము కృష్ణా బోర్డు దృష్టికి తీసుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. డెల్టాకు రావాల్సిన ఆరు టీఎంసీల నీరు కూడా తాము అడుగుతామని చెప్పారు.