కడుపు మండితే..: ఏరాసు, బొత్స మాట వేరే: ఆనం
హైదరాబాద్/కాకినాడ: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలను వినిపించిందని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిపుణులతో చర్చించిన తర్వాత ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపు, ఓటములు లెక్కకాదని ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.
అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తే పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని పిసిసి చీఫ్ బొత్స సత్యానారాయణ అన్నారని ఆయన చెప్పారు. సమైక్యవాదం వినిపించే వారిపై చర్యలు తీసుకుంటామని బొత్స సత్యనారాయణ అనలేదని ఆనం రాంనారాయణరెడ్డి పేర్కొన్నారు.

విభజనపై అధిష్టాన నిర్ణయానికి కట్టుబడతా: బాలరాజు
తూర్పు గోదావరి: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర మంత్రి బాలరాజు అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణపై సహచర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు క్రమశిక్షణ ఉల్లంఘనే కిందికే వస్తాయని ఆయన అన్నారు.
కడుపు మండితే...: ఏరాసు
కాగా కడుపు మండితే ఏమైనా మాట్లాడతామని, చర్యలు ఎవరిపై తీసుకుంటారని మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు కూడా తాము తమ పదవులకు రాజీనామా చేశామని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన విషయంలో సంప్రదాయాలు పాటించాల్సిందేనని తెలిపారు. మిగితా రాష్ట్రాల్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గడువు ఉండాలని ఆయన అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని ఏరాసు చెప్పారు.
విభజనపై బిజెపి తీరు అస్పష్టం: విఠల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి అనుమానస్పదంగా ఉందని తెలంగాణ జెఏసి రాష్ట్ర కో కన్వీనర్ విఠల్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో విభజన బిల్లు ఉండాలని బిజెపి నేతలు కోరడంపై తమకు పలు అనుమానాలున్నాయని ఆయన తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా రాష్ట్ర విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని విఠల్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications