అబద్దం మానండి, లేదంటే: కేసీఆర్కు పరకాల హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు ఆంధ్రప్రదేశ్ గురించి అబద్ధాలు చెప్పడం మానివేయాలని, లేకపోతే వారి గురించి నిజాలు చెప్పి వారి దౌర్జన్యాలను, ఆగడాలను, దౌష్టీకాన్ని ప్రజల ముందు పెట్టి, నిజాలు కక్కిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం హెచ్చరించారు.
సచివాలయంలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖలో పని చేస్తున్న ఫైనాన్స్ మేనేజర్ రామారావును తెలంగాణ లేబర్ కమిషనర్ తన కార్యాలయానికి పిలిపించుకుని గంటసేపు నిర్బంధించి ప్రశ్నించారన్నారు. తెలంగాణ నేతలు రాత్రి ఒక రకంగా, పగలు మరో రకంగా మాట్లాతుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు అధికారులకు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు అధికారులు జూలై-అక్టోబర్ నెలల మధ్య లేఖలు రాసి 10.59 కోట్ల రూపాయలు వేతనాలు, సంక్షేమ పథకాలు తదితర అవసరాల కోసం తీసుకున్నారని పరకాల తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2014 సెప్టెంబర్ 23న సమావేశమై భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డుకు సంబంధించిన నిధుల వినియోగంపై ఒక ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఆ తర్వాతే హైదరాబాద్ బ్యాంకుల్లో ఉన్న నిధులను విజయవాడకు తరలించారన్నారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి అందుబాటులో ఉన్న నిధులు రెండు రాష్ట్రాలు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 850 కోట్ల రూపాయలు రావలసి ఉండగా, అంతే వినియోగించుకుంటున్నామని, తెలంగాణకు 613 కోట్ల రూపాయల అందాల్సి ఉండగా 76 కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ వద్ద ఉన్నాయన్నారు.
వాస్తవాలు ఇలా ఉండగా, కేసీఆర్, మంత్రులు యాగీ చేస్తున్నారన్నారు. ఇప్పటికే వివిధ విభాగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి క్యాబినెట్ కార్యదర్శితోనూ, హోంశాఖ కార్యదర్శితోనూ చర్చిస్తారని తెలిపారు. గవర్నర్తో జరిగిన చర్చల వివరాలను కూడా కేంద్రానికి తెలియచేస్తామన్నారు.