ఏపి ‘హోదా’కు మద్దతిస్తాం: వీహెచ్, కెసిఆర్ వైఖరి తెలపాలని డిమాండ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ను కాంగ్రెస్ నేతలు కూడా సమర్ధిస్తారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు స్పష్టం చేశారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం ఏవో సమస్యలున్నాయన్న వెంకయ్య వాదన సరికాదని విహెచ్ అన్నారు. కేంద్రం ఏపికి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్పై జాతీయ స్థాయిలో పోరాడేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తానని వీహెచ్ తెలిపారు.
నరేంద్ర మోడీ సర్కారు తెచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ను పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని వీహెచ్ హెచ్చరించారు. కేంద్రం తీసుకువచ్చిన భూసేకరణ చట్టంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఖరి తెలపాలని విహెచ్ డిమాండ్ చేశారు. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు.
ఢిల్లీలో మోడీకి పట్టిన గతే కెసిఆర్కూ పడుతుంది: షబ్బీర్
నిజామాబాద్: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీకి పట్టిన గతే ముఖ్యమంత్రి కెసిఆర్కూ పడుతుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కెటిఆర్ సభకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని కెటిఆర్ పరామర్శించకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత కెటిఆర్కు లేదని షబ్బీర్ అలీ అన్నారు.