ఐ అండ్ పీఆర్ కమిషనర్పై చర్యలు, ఏకగ్రీవాలపై షాడో టీంలు: నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీల ఏకగ్రీవ ఎన్నిక అంశం హాట్ టాపిక్గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏగ్రీవాలపై పూర్తిస్థాయిలోనిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు. శుక్రవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఏకగ్రీవాలపై రంగంలోకి షాడో టీంలు..
కర్నూలు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎస్ఈసీ నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థి భిన్నాభిప్రాయాలతో బాగుపడుతుందన్నారు. అందుకే మంచి నాయకత్వం, సామాజిక దృక్పథం వస్తుందని ఆయన తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలపై విధిగా షాడో టీంలు ఏర్పాటు చేయడంతోపాటు, అవసరమైతే గృహ నిర్బంధాలు చేయాలని జిల్లా అధికారులకు సూచించినట్లు ఎస్ఈసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో అధికార వ్యవస్థలన్నీ విజయవంతంగా పనిచేయబోతున్నాయన్నారు.
ఏకగ్రీవాల పేరుతో బలవంతపు ఎన్నికలా?
అంతేగాక, ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఐఅండ్ పీఆర్ కమిషనర్ను వివరణ కోరినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ఆయనపై చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏకగ్రీవాల పేరుతో బలవంతపు ఎన్నికలు జరుపుతారేమో అనే ఆందోళనతో వివిధ పార్టీలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయని, ప్రలోభపెట్టి, భయపెట్టి ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని భయభ్రాంతులకు గురిచేయొద్దని రాజకీయ నేతలకు తేల్చి చెప్పారు.
ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఎస్ఈసీకి తెలియాల్సిందే..
ఏకగ్రీవాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్ఈసీ పరిధిలోనే ఉంటుందన్నారు. ప్రకటనలు ఇచ్చే ముందు విధిగా ఎస్ఈసీని సంప్రదించాలన్నారు. ఎన్నికలపై ఫిర్యాదులకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, మంచి వాతావరణంలో ఎన్నికలను జయప్రదం చేయాలని ప్రజలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. అనంతరపురం జిల్లాలోనూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర సిబ్బందితోనే జరుగుతుందని, అందుకు తగిన సమర్థత సిబ్బందికి ఉందని ఎస్ఈసీ తెలిపారు.