మెట్రో వార్తపై కేసీఆర్ స్పందన, సూటిగా చెప్పని గాడ్గిల్
హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు పైన వచ్చిన వార్తల పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం స్పందించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా మెట్రో రైలు పైన కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ మధ్య లేఖలు అత్యంత సహజమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేందుకే మెట్రో పైన వార్తలు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పత్రికలు రాస్తున్నాయన్నారు. మెట్రో ప్రాజెక్టు పైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండో విడత మెట్రో ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. కేంద్రంతో మాట్లాడుతామని, ఢిల్లీ మెట్రో నిపుణులు శ్రీధరన్ సలహాను తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.
కాగా, అంతకుముందు మెట్రో రైలు ప్రాజెక్టు పైన వచ్చిన వార్తల పైన ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ స్పందించిన విషయం తెలిసిందే. మెట్రో ప్రాజెక్టు లాభదాయకమేనని, ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తుందని, విభజన తర్వాత కూడా మెట్రో బాగా నడుస్తోందని, మెట్రో పైన విభజన ఎఫెక్ట్ ఉండదని చెప్పారు. రాష్ట్రం విడిపోక ముందు కూడా ఇలాంటి లేఖలు రాశామన్నారు. కాగా, ప్రాజెక్టు నుండి తప్పుకుంటారా అని విలేకరులు గాడ్గిల్ను ప్రశ్నించారు. దీనిపై ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదని అంటున్నారు.