జులై నుండి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి..!
అమరావతి: జులై నుంచి ఆంధ్రప్రదేశ్లో బండి నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలనుకునే నిబంధనను అమలు చేయాలని ఏపీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా జులై 1వ తేదీ వరకు గడువు ఇచ్చి, ఆ తర్వాత జరిమానాని వసూలు చేయనున్నారు.
‘‘హెల్మెట్ లేకుండా బైక్లు, సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించండి'' అంటూ ఏపీ డీజీపీ జేవీ రాముడు పోలీసు, రవాణా సిబ్బందితో కూడిన ‘రహదారి భద్రతా సంస్థ' సంయుక్త బృందాలకు ఆదేశాలు జారీ చేశారు.
జూలై 1 నుంచి ఏపీలోని అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో తప్పనిసరిగా హెల్మెట్ అమలు చేయాలని నిర్ణయించారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా రాష్ట్ర, జాతీయ రహదారుల్లో నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారంతా సీటు బెల్టు పెట్టుకోవాలని నిర్ణయించారు.
ఏపీ మోటారు వాహన చట్టం ప్రకారం బైక్పై వెనుక సీటులో కూర్చునే వారూ హెల్మెట్ పెట్టుకోవాలి. కారులో డ్రైవర్తోపాటు ముందు సీటులో ఉన్నవారూ సీట్ బెల్టు ధరించాలి. కాగా, జూలై 1 నుంచి ప్రతినెలా ఎనిమిది రోజులపాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారు.
వీటితో పాటు మద్యం తాగి వాహనం నడపడం, లైసెన్సు లేకుండా బండి నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. స్కూలు బస్సులను ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కేసు నమోదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.