ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు: ఉరుములుమెరుపులతో కూడిన వానలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు మధ్య వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం ఉత్తరకోస్తా, యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది.

శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాలోని ఒకటి రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలోని ఒకటి రెండు చోట్ల శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోనూ శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు.












Click it and Unblock the Notifications