కరుణించవా వరుణ దేవా.. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు !!
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇది రాబోయే బుధవారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మూడు రోజులు వర్షాలే..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఎక్కువగా ప్రభావితమయ్యే జిల్లాలు..
ఉత్తరాంధ్ర జిల్లాలు - విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం -లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అలాగే రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, తీర ఆంధ్రలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
రైతులకు హెచ్చరిక..
రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వరి, పత్తి, కూరగాయల పంటలకు వర్షం, నీటినిల్వల వల్ల నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు.
ప్రజలకు జాగ్రత్తలు..
వర్షాల సమయంలో వాగులు, చెరువులు, కాల్వల దగ్గరికి వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రహదారులపై నీరు నిల్వ ఉండే పరిస్థితుల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 1070 లేదా 1800-425-0109 నంబర్లకు సంప్రదించాలని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ లైన్లు, చెట్లు విరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నడవకూడదని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications