‘కొత్త’ పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ: బీజేపీకి దూరమేనా?, కన్నా చేరిక, బీఆర్ఎస్పై ఇలా
ఎన్నికల పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తులోనే ఉందని, పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకుంటే ఒంటరిగా వెళతామని.. లేదంటే కొత్త పొత్తులుంటాయన్నారు.
కరీంనగర్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన ప్రచార రథం 'వారాహి'కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం వాహనాన్ని ప్రారంభించారు. పవన్ కొండగట్టుకు రావడంతో ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.

ప్రాణాపాయం తప్పిందన్న పవన్ కళ్యాణ్: అందుకే కొండగట్టుకు
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామి అంటే అమితమైన భక్తి అని చెప్పారు. తాను 2008లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు తన తలపై వెంట్రుకలు తగిలాయని, అయితే, తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. అందుకే తనకు ఆంజనేయస్వామి అంటే ప్రత్యేకమని ఆరాధన అని తెలిపారు. అందుకే తాను కొండగట్టులో తన ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

బీజేపీతో పొత్తు ఉందంటూనే పవన్ కళ్యాణ్ ట్విస్ట్
మరోవైపు, ఎన్నికల పొత్తులపైనా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తులోనే ఉందని, పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకే పొత్తులు కీలకమని చెప్పారు. ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకుంటే ఒంటరిగా వెళతామని.. లేదంటే కొత్త పొత్తులుంటాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఎన్నికలకు వారం ముందే పొత్తులపై క్లారిటీ అంటూ పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పడం గమనార్హం. ఓట్లు చీలకుండా పొత్తులు ఉంటాయన్నారు. ఎన్నికలకు వారం పది రోజుల ముందు పొత్తులపై స్పష్టత వస్తుందని.. అప్పుడే ప్రకటన చేస్తామన్నారు. బీజేపీ ఒకవేళ తమతో కలిసి రాకుంటే కొత్త పొత్తులుంటాయని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

తెలంగాణలో జనసేన, బీఆర్ఎస్ పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందన
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం తాము స్వాగతిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మార్పు అనేది రాజకీయాల్లో సహజమన్నారు. తెలంగాణలో ఎక్కువ పార్టీలు ఉండటం మంచిదేనని అన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభించడంపై ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు. తెలంగాణలో జనసేన పాత్రను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. తెలంగాణలో కూడా జనసేన తనవంతు పాత్రను పోషిస్తుందన్నారు.

జనసేనలోకి కన్నా?: పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?
కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారంపై మీడియా ప్రశ్నించగా.. ఆయన ఏ పార్టీలో ఉన్నా తమకు సన్నిహితులేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాము బీజేపీతో పొత్తులో ఉన్నందున కన్నా పార్టీ మార్పు అంశంపై స్పందించనని చెప్పారు. దావోస్లో తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని.. ఏపీ పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అంతగా ఆసక్తి చూపలేదని, శ్రమించలేదని అన్నారు. ఆరంభంలో చూపిన ఆసక్తి ఇప్పుడు లేదన్నారు.












Click it and Unblock the Notifications