‘ఏం మాట్లాడుతున్నావ్.. తెలివుందా? లేదా?’: జగన్ పై దేవినేని ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఉనికిని కాపాడుకోవడానికి జగన్ ధర్నాలు, దీక్షలు అంటూ తిర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఉనికిని కాపాడుకోవడానికి జగన్ ధర్నాలు, దీక్షలు అంటూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.
రైతుల పక్షాన పనిచేస్తోన్న తమ ప్రభుత్వంపై జగన్ లేని పోని నిందలు వేస్తున్నారని అన్నారు. 'అసలు ఏం మాట్లాడుతున్నాడు.. తెలివి ఉండి మాట్లాడుతున్నాడా.. లేక మాట్లాడుతున్నాడా?.. బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా? లేకుండా మాట్లాడుతున్నాడా?' అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
ఇటువంటి ప్రతిపక్ష నాయుకుడు దొరకడం మన దురదృష్టమని దేవినేని అన్నారు. అందరిదీ ఒకదారైతే తనది మరో దారి అన్నట్లు జగన్ ప్రవర్తిస్తున్నారని, కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తూ జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అన్నారు.
జగన్కు అసలు ఏ అంశంపైనా అవగాహన లేదని అన్నారు. వంశధార పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది నుంచే నీరు అందించాలని తాము అనుకుంటున్నామని.. జగన్ మాత్రం దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు.