కాపుల కోసం మీరు చేసిందేంటి..? : చిరు, దాసరిలకు ప్రత్తిపాటి సూటి ప్రశ్న
విజయవాడ : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్ని ముద్రగడ దీక్ష చుట్టే తిరుగుతున్నాయి. తని ఘటన కేసులు ఎత్తేసేదాక దీక్ష విరమణకు ససేమిరా అంటున్న ముద్రగడ ఓవైపు.. దీక్ష విరమిస్తేనే విషయంపై పునరాలోచన అంటున్న ప్రభుత్వం మరోవైపు.. ఇవి రెండు గాక ఎప్పటికప్పుడు సమాలోచనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న కాపు నేతల భేటీలు ఇంకోవైపు.
ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలను మూకుమ్ముడిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇదే క్రమంలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ముద్రగడ ఆరోగ్యంపై ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగుతోందని ప్రకటించారు. ఏడో రోజు ముద్రగడ దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరిస్తుందని, ముద్రగడ మాత్రం చికిత్సకు నిరాకరిస్తున్నారని తెలిపారు.
ఇకపోతే ముద్రగడ దీక్షతో ఒక్క తాటి పైకి వచ్చిన చిరంజీవి, దాసరి నారాయణరావు లాంటి నేతలపై విమర్శలు గుప్పించారు ప్రత్తిపాటి. 'అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు నేతలు కాపు జాతి ప్రయోజనాల కోసం ఏం చేశారో చెప్పాలని' నిలదీశారు.

ముద్రగడతో మరో దఫా చర్చలు : చినరాజప్ప
ఇక ఇదే విషయంపై స్పందించిన ఏపీ హోంమంత్రి చినరాజప్ప.. ముద్రగడ ఆరోగ్యం క్షీణించిపోకుండా ఉండడానికి సీనియర్ వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.
తుని ఘటనకు సంబంధించిన కేసుల విషయంలో ప్రభుత్వం నిబంధనలకు లోబడే వ్యవహరించిందని స్పష్టం చేసిన ఆయన, ఈ విషయంలో మరో దఫా చర్చల కోసం ప్రభుత్వ బృందాన్ని ముద్రగడ వద్దకు పంపిస్తామని చెప్పారు. అంతకుముందు సీఎం చంద్రబాబును కలిసిన హోంమంత్రి చినరాజప్ప, ముద్రగడ షరతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications