తిరుగుబాటు: ఆరుగురు సీమాంధ్ర ఎంపీల దారెటు?
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురేసిన ఆ ఆరుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎటు వైపు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెసులో వారి భవిష్యత్తుకు దారులు మూసుకుపోయినట్లేనని భావిస్తున్నారు. వారు ఏ పార్టీ వైపు వెళ్తారనే విషయంపై ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ స్పష్టమైన చిత్రం రావడం లేదు.
లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివ రావు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్టానంపై సమరం ప్రకటించారు. లోకసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ద్వారా వారు కాంగ్రెసుతో తెగదెంపులకు సిద్ధపడ్డారని అనుకుంటున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీని స్థాపిస్తే అందులో చేరడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆయన పార్టీని పెడతారా అనేది తేలడం లేదు. సీమాంధ్ర ప్రజలతో కలిసి వెళ్తానని ఆయన తాజాగా శనివారంనాడు అన్నారు. కానీ, అది పార్టీ పెట్టడానికి సంకేతం ఇచ్చినట్లు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పెట్టే విషయాన్ని ముఖ్యమంత్రి కొట్టిపారేయడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ దమ్ము లేదని ఆయను ప్రత్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి అంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే తప్పకుండా అందులో చేరుతానని రాయపాటి సాంబశివ రావు అన్నారు. నిజానికి, రాయపాటి చాలా కాలంగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. కేంద్రంలో తనకు మంత్రి పదవి లభించలేదని ఆయన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు. గతంలో కూడా ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణకు ప్రాధాన్యం ఇస్తూ తనను గుర్తించడం లేదనే అభిప్రాయం కూడా ఆయనలో ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారా అనేది చెప్పలేని విషయంగానే ఉంది.
కాగా, రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని లగడపాటి రాజగోపాల్ చాలా సార్లు చెప్పారు. కానీ, అది జరిగే పనిలా కనిపించడం లేదు. బిజెపిలో గానీ తెలుగుదేశం పార్టీలో గానీ చేరడానికి ఆయన మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల అన్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనేది చెప్పలేం. అయితే, ఆయన ప్రాతినిధ్యం వహించిన రాజమండ్రి లోకసభ సీటును సినీ నటి, రాంపూర్ ఎంపీ జయప్రదకు ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఉండవల్లి కొంత కాలం మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును చూసుకునే అవకాశం ఉంది.
హర్షకుమార్ ఏ పార్టీలో చేరుతారనేది తేలడం లేదు. ఆయనకు సంబంధించి ఏ విధమైన ప్రచారాలు కూడా సాగడం లేదు. నిజానికి, తొలుత రాష్ట్ర విభజనను హర్షకుమార్ సమర్థించారు. కానీ అకస్మాత్తుగా వీర సమైక్యవాదిగా మారిపోయారు. సాయి ప్రతాప్ వైయస్సార్ కాంగ్రెసులో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆ కారణంగానే ఆయన కేంద్ర మంత్రి పదవి పోయినట్లు భావిస్తారు.
సబ్బం హరి చాలా కాలంగా పార్టీ అధిష్టానానికి దూరంగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన దగ్గరయ్యారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ ప్రకటన నేపథ్యంలో దూరంగా పెట్టింది. ఆయన ఎటువైపు వెళ్తారనేది చెప్పడం కష్టంగానే ఉంది. ఏమైనా, ఈ ఆరుగురు పార్లమెంటు సభ్యుల రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గానీ ఏమిటనేది తెలియదు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications