గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేత సరే!...మరి వంగవీటి రాధా సంగతేంటి ఏంటి?
విజయవాడ :వంగవీటి రాధా, రంగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పూనూరు గౌతమ్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను వైసిపి అధిష్టానం ఎత్తివేసింది. జగన్ పాదయాత్ర విజయవాడ నగరం చేరుకోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరోవైపు ఇప్పటికే జగన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్న వంగవీటి రాధా తాజా పరిణామంపై ఎలా స్పందిస్తారనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాధా స్పందించిన తీరు బట్టే గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేత విషయం రాధాతో వైసిపి అధినేత జగన్ ముందే చర్చించారా? లేక రాధాను తానే పార్టీ నుంచి పంపించేందుకు పొమ్మనలేక పొగబెట్టారా? అనేది తేలిపోనుంది.
ఆరంభంలోనే...రెండు ముఖ్య ఘట్టాలు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి నుంచి శనివారం ఉదయం 136వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. కనకదుర్గ వారధి గుండా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు. అయితే ఎపికి గుండెకాయ లాంటి విజయవాడలో అడుగుపెట్టడంతోనే వైసిపి అధినేత జగన్ తమ పార్టీకి సంబంధించి రెండు ముఖ్య ఘట్టాలను స్వాగతించారు. అవి ఒకటి టిడిపి నేత యలమంచలి రవి వైసిపి పార్టీలో చేరడం...మరొకటి నిన్నటి తమ పార్టీ నేత పూనురు గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తి వేసి మళ్లీ అక్కున చేర్చుకోవడం... అయితే వైసిపి అధినేతగా జగన్ విజయవాడలో అడుగుపెట్టడంతోనే ఆ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారేమో తెలియదు కానీ...రాజకీయ పరిశీలకులు మాత్రం జగన్ మరోసారి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని...జగన్ తాజా బెజవాడ పరిణామాల ఫలితంగా కొంత లబ్ది...ఎక్కువ నష్టం చవిచూడక తప్పదని విశ్లేషఇస్తున్నారు. అదెలాగంటే?...
ప్రభావం...మూడు సామాజిక వర్గాలపై...
జగన్ ఈ రోజు విజయవాడలో తీసుకున్న నిర్ణయాలు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు సామాజిక వర్గాలపై మూడు రకాల ప్రభావాలు చూపనున్నాయి. ఒకటి టిడిపి పార్టీకి ప్రధాన బలమైన కమ్మ సామాజిక వర్గం నేతను వైసిపిలో చేర్చుకోవడం ద్వారా తమ పార్టీకి ఆ సామాజికవర్గం బలం మరింత చేకూరేటట్లు చేసుకోవడం జగన్ ముఖ్య ఉద్దేశం. అంతవరకు జగన్ తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్నట్లే లెక్క. ఇక గౌతమ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయడం. ఈ నిర్ణయం విషయంలో జగన్ తొందరపడ్డారనే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కారణం విజయవాడలో కమ్మ సామాజికవర్గం చేరికతో ఇక అక్కడ కాపు సామాజికవర్గం మద్దతు లేకపోయినా ఫరవాలేదని భావిస్తున్నారా...అందులోనూ వంగవీటి రాధా ఇదే విషయమై తీవ్ర మనస్థాపం చెంది...తదనంతర పరిణామాలతో పార్టీ మారే యోచన చేస్తున్నారని తెలిసీ జగన్ విజయవాడలో అడుగుపెట్టీ పెట్టడంతోనే గౌతమ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయడమంటే ఇక వంగవీటి రాధాను తనదారి తాను చూసుకోమని స్పష్టంగా చెప్పడమేనంటున్నారు.
ఇప్పటికే శెట్టి బలిజ...మళ్లీ కాపు...
ఇటీవలే శెట్టిబలిజ సామాజిక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తరుణంలో మళ్లీ కాపు సామాజిక వర్గం నొచ్చుకునేలా జగన్ నిర్ణయాలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో...దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో జగన్ ఊహించకపోయుండవచ్చని రాజకీయ పరిశీలకు అభిప్రాయపడుతున్నారు. సారూప్యత కలిగిన బలమైన సామాజిక వర్గాలు కాపు, శెట్టి బలిజ నుంచి వ్యతిరేకగళం వినిపిస్తున్న ఈ తరుణంలో జగన్ ఆయా సామాజికవర్గాలపై నేరుగా ప్రభావం చూసే గౌతమ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేత నిర్ణయానికి ఎందుకు అంత తొందరపడ్డారనేది అంతుపట్టకుండా ఉంది. అందులోనూ గౌతమ్ రెడ్డి...జగన్ కు బంధువని, అతనిపై సస్పెన్షన్ వేటు తూతూమంత్రమేనని ముందు నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం జగన్ పరిగణనలోకి తీసుకోలేదనే తెలుస్తోంది. పర్యవసానంగా జగన్ తనను విమర్శించేవారికి కొన్ని బలమైన ఆయుధాలు తానే అందించినట్లయిందని కొందరు వైసిపి నేతలే అంతర్గతంగా మథనపడుతున్నారు.
గౌతంరెడ్డి ఉదంతంతో వంగవీటి రాధకు టికెట్ ఇచ్చేదిలేదని
జగన్ పరోక్షంగా స్పష్టం చేసినట్లుందని రాధా అనుచరులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ పరిధిలో ఉన్న మూడు సీట్లను ఇప్పటికే ముగ్గరికి ఖాయం చేశారని, అలా టికెట్ కన్ ఫర్మ్ అయిన వారిలో రాధా పేరు లేదని, ఇక నిర్ణయం తీసుకోవడం ఆయన వంతే అన్నట్లుగా జగన్ అలా చేసినట్లు రాధా అనుచరులు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనను పార్టీలోనుంచి సాగనంపడానికి ఇదే సరైన తరుణమని జగన్ భావించారని ప్రచారం జరుగుతోంది.
రాధాను పంపడానికేనా...లేక ఇంకేదైనా వ్యూహమా?
ఇటీవలికాలంలో వ్యూహాల అమలులో దూకుడుతో పాటు పరిణతి కనబరుస్తున్న జగన్ మరోసారి కేవలం దూకుడుకే ప్రాధాన్యత ఇచ్చి తీసుకున్న నిర్ణయంలా ఇది కనిపిస్తోందని అంటున్నారు. లేదా అధికార పార్టీ టిడిపి ఆరోపిస్తున్నట్లు బిజెపి-వైసిపి-జనసేన మూడు పార్టీల మేళవింపులో భారీ స్థాయిలో రూపొందించిన సుదీర్ఘ వ్యూహం ఏమైనా ఉందేమోనని...అలాంటి వ్యూహాలు అమల్లోకి వచ్చినపుడో ఆయా పార్టీల నేతలో వెల్లడిస్తే తప్ప వాటిని ఊహించడం సాధ్యంకాదని, మరి జగన్ అలాంటి వ్యూహంలో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా కృష్ణా జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుండగా జగన్ ఈ జిల్లా పర్యటన తొలిరోజు నిర్ణయాల పర్యవసానాలు ఎలా ఉంటాయనేది తానే స్వయంగా తెలుసుకోవడం ఖాయం అంటున్నారు.