టీడీపీ మహానాడు అంతా జగన్ నామస్మరణే.. చెల్లికి ఆయనిచ్చిన ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు
టీడీపీ మహానాడు కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహానాడులో టీడీపీ నాయకులు వాడిన భాష, వారి ప్రవర్తన చూస్తే అసహ్యం కలుగుతోందని రోజా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు తరచూ ప్రస్తావించడం టీడీపీలో జగన్ పట్ల ఉన్న భయానికి నిదర్శనమని చెప్పారు.
సైకిల్ పార్టీ మహానాడా లేదా సైకో పార్టీ మహానాడా: మాజీమంత్రి రోజా ఫైర్
"జగన్ కాలి గోటికి సరిపోని వ్యక్తులు కూడా ఆయన గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేదా సైకో పార్టీ మహానాడా?" అని ప్రశ్నించారు రోజా. టీడీపీ కార్యకర్తలు కూడా ఈ మహానాడును పట్టించుకోలేదని, జనాన్ని రప్పించడానికి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు విమర్శించారు. ఇది చంద్రబాబు మహానాడు కాదు, దగానాడు అని ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు.

జగన్ నామస్మరణకు పరిమితమైన టీడీపీ మహానాడు
టీడీపీ మహానాడు జగన్ నామస్మరణకు పరిమితమైందన్నారు. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తల్లి, చెల్లి అని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటు, మోసాల ద్వారా అధికారం చేపట్టగా, జగన్ సొంత కష్టంతో ఎదిగారని అసలు చంద్రబాబుకు, జగన్ కు పోలికే లేదన్నారు. .
హెరిటేజ్ ఆస్తుల్లో చంద్రబాబు తల్లి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్పండి?
చంద్రబాబు కుటుంబ ఆస్తుల విషయంలో రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. "జగనన్న తన చెల్లికి ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు. హెరిటేజ్ ఆస్తుల్లో చంద్రబాబు తల్లి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్పండి" అని సవాల్ విసిరారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. హోం మంత్రి వంగలపూడి అనితపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
వెన్నుపోటు రెండేళ్లు అనే బుక్ లెట్ ప్రతీ గడపకు చేరుస్తాం
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులు దేశంలో చివరి ర్యాంకులకు పడిపోయారని రోజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారందరిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచిపోయి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మోసాలను బయటపెట్టేందుకు "వెన్నుపోటు రెండేళ్లు" అనే బుక్లెట్ను ప్రతి గడప చేర్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.













Click it and Unblock the Notifications