చంద్రబాబు కాన్వాయ్ కుదింపు: భక్తుల భద్రతకే పెద్దపీట, వాట్సప్ నంబర్
రాజమండ్రి: పుష్కరాలకు సంబంధించిన సమాచారం, సదుపాయాలను తెలుసుకునేందుకు వాట్సప్ నంబర్ 9401235816 ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చిన భక్తుల కోసం రాజమండ్రిలోని కోటిలింగాల రేవు నుంచి ధవళేశ్వరం వరకు అన్ని రేవులను కలుపుతూ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పుష్కరాల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు, భద్రత నిమిత్తం విధుల్లో 30 కంపెనీల బలగాలు అదనంగా విధులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. రాజమండ్రితో పాటు మిగతా ప్రముఖ ఘాట్ల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ పోలీసు అధికారికి అప్పగించినట్లు తెలిపారు.
తొలిరోజైన మంగళవారం రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాటల్ జరిగిన ప్రమాదంలో 27 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఈ 12 రోజులు రాజమండ్రిలోనే ఉండి పుష్కరాల ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో సీఎం కాన్వాయ్ మూడు వాహనాలకు కుదించామని, అవసరమైతే సీఎం కాలినడకన పర్యటిస్తారని స్పష్టం చేశారు.
పుష్కరాలకు వచ్చిన భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేస్తున్నామని, భక్తుల ప్రతిస్పందనను ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సేకరిస్తామన్నారు. ఇది ఇలా ఉంటే తొలిరోజు ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.