పవన్ కల్యాణ్కు మరో షాక్.. వైసీపీ బాటలో బీజేపీ.. జగన్లాగే యడ్యూరప్ప ‘వికేంద్రీకరణ’కు ఆమోదం
Recommended Video

ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, దాని కోసం ఎంత దూరమైనా వెళతానని, బీజేపీతో కలిసి 'సేవ్ అమరావతి' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పదేపదే రాజధాని రైతులకు హామీ ఇస్తూవస్తున్నారు. కానీ నమ్ముకున్న బీజేపీనే ఆయనకు గట్టి షాకిచ్చింది. ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన లాగే, కర్నాటకలోనూ పరిపాలనా వికేంద్రీకరణ ప్రక్రియకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

శాఖల తరలింపు..
కర్నాటకలో ప్రభుత్వ శాఖలన్నీ బెంగళూరు కేంద్రంగానే పనిచేస్తున్నాయి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇరిగేషన్, విద్యుత్, చేనేత, చక్కెర తదితర ముఖ్యమైన శాఖలతోపాటు కర్నాటక మానవ హక్కుల కమిషన్, ఉపలోకాయుక్త ఆఫీసుల్ని కూడా ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని యడ్యూరప్ప సర్కారు నిర్ణయించింది. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వివాదం తారాస్థాయికి చేరిన సమయంలోనే కర్నాటకలో శాఖల తరలింపు వ్యవహారంలో కదలిక రావడం గమనార్హం. ఏపీ, కర్నాటక ప్రభుత్వాల ప్రతిపాదనలపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీనే కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

హైకమాండ్ ఏం చెప్పిందంటే..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సమానంగా జరగాలన్నది బీజేపీ అభిమతమని, వెనుకబడ్డ ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని శాఖల ముఖ్యకార్యాలయాన్ని ఇక్కడికి తరలిస్తున్నామని కర్నాటక మంత్రి ఈశ్వరప్ప చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా కర్నాటక సర్కారు.. బీజేపీ హైకాండ్ ను కోరిందని, రాష్ట్రంలో శాఖల తరలింపు, కార్యాలయాల ఏర్పాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే వీలుంది కాబట్టి దీనికి తాము అభ్యంతరం చెప్పబోమంటూ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ వెంటనే రాష్ట్ర కేబినెట్ తరలింపు ప్రక్రియకు ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.

పేర్లు వేరు పని ఒకటే..
నిజానికి ఏపీ ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటు, కర్నాటక ప్రభుత్వం చేపట్టిన శాఖల తరలింపు.. రెండూ వేర్వేరు అంశాలే అయినప్పటికీ.. ఇందులోని స్థూల ఉద్దేశం పరిపాలనా వికేంద్రీకరణ. ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణు వ్యతిరేకించి, కర్నాటకలో మాత్రం ఏలా చేపడతారన్న విమర్శలకు బీజేపీ నాయకులు గట్టిగా బదులిస్తున్నారు. ఏపీలోనూ పరిపాలన వికేంద్రీకరణ జరగాలని బీజేపీ కోరుతోందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తాము ఇదివరకే తీర్మానం చేశామని గుర్తుచేస్తున్నారు.

వైసీపీలో కొత్త ఉత్సాహం..
కర్నాటక సర్కారు వికేంద్రీకరణ నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరమిలా ఏపీలో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పొంగుకొచ్చింది. ‘ఏపీ సీఎం జగన్ ను ఫాలో అవుతోన్న కర్నాటక సీఎం యడ్డీ' అంటూ ప్రముఖ పత్రికల్లో వచ్చిన వార్తలను చూసుకుని వైసీపీ నేతలు మురిసిపోతున్నారు. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా, వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలును జ్యూడీషియల్ కేంద్రంగా చేయాలన్న సీఎం జగన్ ఆలోచనకు కూడా బీజేపీ బాసటగా నిలుస్తుందన్న నమ్మకం.. కర్నాటక పరిణామంతో మరింతగా బలపడిందని వైసీపీ కీలక నేతలు అంటున్నారు.

జనసేనానికి ఏం చెబుతారు?
ఏపీలో బీజేపీ.. జనసేన పార్టీతో కలిసి పనిచేస్తున్నప్పటికీ రాజధాని తరలింపు విషయంలో పవన్ కల్యాణ్ ను పదే పదే విభేదిస్తుండటం చర్చనీయాంశమైంది. గతవారం అమరావతి ప్రాంతంరలో పర్యటించిన జనసేనాని.. ఏపీకి శాశ్వతరాజధాని అదేనని, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టుకూడా అమరావతిలోనే కొనసాగుతాయని, ఆ మేరకు కేంద్రం పెద్దలతో మాట్లాడుతాననీ భరోసా ఇచ్చారు. ఆయనిలా చెప్పిన వారం రోజులకే... కర్నాటకలో పాలనా వికేంద్రీకరణకు బీజేపీ హైకమాండ్ ఓకే చెప్పడం, దానిపై వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండటం జనసేనకు ఇబ్బందికర పరిణామాలుగా తయారయ్యాయి. దీనిపై ఏపీ బీజేపీ నేతలు.. జనసేనానికి ఏం వివరణ ఇస్తారో, దానికి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications