సీఎం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా..? కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా చౌదరి
అమరావతి రాజధాని మారుస్తామని ఏపీ ప్రభుత్వం సంకేతాలివ్వడం సరికాదని బీజేపీ నేత సుజనా చౌదరి విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడ్డారు.

వేల కోట్ల వ్యయం..
రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వ్యయం చేసిందని సుజనా చౌదరి గుర్తుచేశారు. అమరావతిలో దాదాపు రూ.10 వేల కోట్లతో పనులు చేపట్టారని పేర్కొన్నారు. భవన నిర్మాణాలు కూడా దాదాపుగా పూర్తికావొచ్చని.. ఈ సమయంలో రాజధాని మార్పు అని ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఫైరయ్యారు.

ఏకపక్ష ధోరణి..
రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుజనా చౌదరి చెప్పారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు. మూడు రాజధానులు తప్పదని, గుడ్డిగా ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజధాని మార్పుపై సరైన సమయంలో కేంద్రం స్పందిస్తోందని ఇండికేషన్స్ ఇచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలే తప్ప.. ఏకపక్షంగా ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదన్నారు.

వడి వడిగా..
రాజధాని మార్పునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. హై పవర్ కమిటీ నివేదికకు తుది మెరుగులు దిద్దుతోంది. కమిటీ రిపోర్ట్ అందజేశాక వెంటనే మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశం నిర్వహించి.. రాజధాని ప్రకటించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. కానీ 29 గ్రామాలు, టీడీపీ, ఇతర ప్రజాసంఘాలు మాత్రం ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. జనసేన-బీజేపీ కూడా రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని మార్పు అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని వైసీపీ నేతలు చెబుతుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని బీజేపీ నేతలు అనడం చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications