అమరావతిలో సినీమాలు తీయడానికి అవకాశాలేవి?: సెన్సార్ సభ్యుడు దిలీప్ రాజా
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సినీమాల నిర్మాణాలకు ప్రభుత్వం ఎందుకు అవకాశం కల్పించడం లేదని సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్రాజా ప్రశ్నించారు. గురువారం ఆయన మా ఎపి కార్యాలయంతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం పై పలు ఆరోపణలు చేశారు.
అమరావతిలో చిత్ర నిర్మాణానికి అవసరమైన కనీస వసతులు కల్పించాలని ఎపి ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖపట్నంలో రామానాయుడు, రాఘవేంద్రరావు లాంటి సినీ ప్రముఖులకు భూములు కేటాయించినా అవి ఇంతవరకూ వినియోగంలోకి రాలేదన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో ఎన్నో చక్కటి లొకేషన్లు ఉన్నాయని, అక్కడ స్టూడియోలు నిర్మిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో సమకూరడంతో పాటు సొంత రాష్ట్రంలో సినిమా నిర్మాణాలు జరుగుతాయని, అయినా ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు అలక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నో సంస్థలకు భూములు ఇస్తున్న ప్రభుత్వం స్టూడియోల ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వాలని దిలీప్ రాజా డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని ఫిలింనగర్, చిత్రపురి కాలనీలు లాంటివి అమరావతిలోనూ ఏర్పాటు చేస్తే నటీనటులు, టెక్నీషియన్లు ఏపీకి వస్తారన్నారు. రాజధానిలో స్టూడియోలు నిర్మించేవారికి భూమి కేటాయిస్తే ముందుకొచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని దిలీప్రాజా తెలిపారు.
ఇక్కడ సినీ నిర్మాణాలు జరిగితే ఎక్కువ మంది ఆంధ్రా ఆర్టిస్టులకు అవకాశాలు వస్తాయన్నారు. ఎపిలో చిత్ర నిర్మాణాలకు అవకాశం లేకపోవడం వల్లే ఎక్కవమందికి అవకాశాలు రావడం లేదని అన్నారు. అయినా ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
అనంతరం సీనియర్ సినీనటుడు నరసింహరాజు మాట్లాడుతూ సినీ ఆ ర్టిస్టులు, సాంకేతిక బృందం తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్లో ఉండాల్సి వస్తోందని, రాష్ట్రం లో అవకాశాలు మెరుగైతే పరిశ్రమ తరలి వస్తుందన్నారు. స్టూడియోల కోసం భూములు తీసుకుని నిర్మించని వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇదే నిర్లిప్తత కొనసాగితే ఆంధ్రాకు తెలుగు సినీ పరిశ్రమ మరో పదేళ్లయినా తరలివచ్చే అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.