వల్లభనేని వంశీ చిక్కడు, దొరకడు ఆట.. కొనసాగుతున్న పోలీసులవేట!!
కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో వల్లభనేని వంశీ ని నిందితుడుగా గన్నవరం పోలీసులు చేర్చడంతో ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపులు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న వల్లభనేని వంశీని గన్నవరంలో అరెస్ట్ చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
వంశీ అరెస్ట్... తప్పుడు ప్రచారమే
అయితే వల్లభనేని వంశీని ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి ఘటన కేసులో నిన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అరెస్టు చేసిన వారిలో వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరులైన సర్నాల రమేష్, యూసఫ్ ఉన్నారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా టీడీపీ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అనుచరులు అరెస్ట్
వంశీ అరెస్టుపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఇప్పటికే ఖండించారు. ఇదిలా ఉంటే బాపనపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఇప్పటికి 19మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు తాజాగా రమేష్, యూసఫ్ లను అరెస్ట్ చేశారు. వీరిలో రమేష్ ను కోర్టులో హాజరు పరిచారు .దీంతో కోర్టు రమేష్ కు 14రోజుల రిమాండ్ విధించింది. ఈరోజు యూసఫ్ ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.
ఆచూకీ తెలియని వంశీ
ఈ కేసులో వల్లభనేని వంశీ తో పాటు, కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిని పలువురిని అదుపులోకి తీసుకోవడానికి హైదరాబాద్ కు వెళ్ళిన ప్రత్యేక బృందాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసిన అధికారులు వంశీ సహా పలువురు కదలికల పైన నిఘా పెట్టారు. అయితే వంశీ ఎక్కడికి వెళ్ళాడు అనేది మాత్రం ప్రస్తుతం అందరిని ఆసక్తికి గురిచేస్తుంది.
మూడు బృందాలు వంశీ కోసం వేట
వల్లభనేని వంశీని పట్టుకోవడానికి ఏపీ టాస్క్ ఫోర్స్, శాంతిభద్రతల విభాగ పోలీసులు మూడు బృందాలుగా జూబ్లీహిల్స్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. రాయదుర్గంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ లో నిందితులు తలదాచుకున్నట్టు తెలిసి అక్కడికి వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, అప్పటికే వారంతా పారిపోయారు. తప్పించుకున్న వారిలో వంశీ అనుచరులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
వంశీ చిక్కడు దొరకడు
ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం వంశీ సతీమణి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు వెళ్ళినట్టు సమాచారం. అయితే వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం పోలీసులకు అంత చిక్కడం లేదు. ఆయన పోలీస్ అరెస్ట్ గురించి ముందే తెలిసే అమెరికా పారిపోయాడని చర్చ జరుగుతుంది. అయితే ఆయన యూఎస్ పరారీని కూడా పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. చిక్కడు దొరకడు అన్నట్టుగా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న వల్లభనేని వంశీ అరెస్టు ఎపిసోడ్ లో ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications