నిర్మొహమాటంగా చెప్పేసిన విజయ్- అమిత్ షా, డీకే శివకుమార్ ముందే..!
తమిళనాడులోని కోవళంలో ఇవాళ నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి (Southern Zonal Council Meet) సమావేశంలో ఆతిధ్య రాష్ట ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (vijay) తన వాదన గట్టిగా వినిపించారు. మిగతా దక్షిణాది సీఎంలు అక్కడే ఉన్నా, అందులో చాలా వరకూ కాంగ్రెస్ నేతలే ఉన్నా విజయ్ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఇందులో కర్నాటక-తమిళనాడు మధ్య చిచ్చు రేపుతున్న కావేరీ అంశంతో పాటు జాతీయ స్ధాయిలో నీట్ పరీక్ష రద్దు వంటి అంశాలున్నాయి.
కర్నాటకతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను విజయ్.. ఈ భేటీలో నేరుగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని విజయ్ కర్నాటక సీఎం డీకే శివకుమార్ ను ఉద్దేశించి స్పష్టం చేశారు. కావేరి నదీ పరివాహక ప్రాంత నిర్వహణ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని పట్టుబట్టారు. విజయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న డీకే శివకుమార్ ముఖం ఒక్కసారిగా తీవ్ర అసహనంతో మారిపోయింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ సమక్షంలో ముల్లపెరియార్ డ్యామ్ నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచాలని విజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల మధ్య ఉండే తాత్కాలిక విభేదాలు పొరుగు సంబంధాలను దెబ్బతీయకూడదని ఆయన హితవు పలికారు.

మరోవైపు తమిళనాడుకు సంబంధించిన మరికొన్ని కీలక ప్రతిపాదనలను కూడా సీఎం విజయ్ ఈ భేటీలో కేంద్రానికి సమర్పించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇంటర్ లేదా ప్లస్-టూ మార్కుల ఆధారంగానే వైద్య సీట్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బెంగళూరు మెట్రో రైలు మార్గాన్ని తమిళనాడులోని హోసూర్ వరకు విస్తరించాలని కోరారు. దీంతో పాటు దక్షిణ రాష్ట్రాలకు ఆర్థిక వ్యయాల్లో మరింత స్వయంప్రతిపత్తిని కల్పించాలని కేంద్రానికి విజయ్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.













Click it and Unblock the Notifications