విభజన: రాజధానిలో ఏపీ హైకోర్టు ఎక్కడ?
అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడిచినా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కోర్టే ఉమ్మడి హైకోర్టుగా పని చేస్తుంది. ఇటీవలే ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్రాలకు వేరు వేరుగా హైకోర్టులకు సంబంధించి ఇచ్చిన తీర్పులో ఏపీలో కొత్త హైకోర్టుని ఏర్పాటు చేసే లోగా సర్క్యూట్ బెంచిలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.
ఏపీ హైకోర్టుని అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఏపీ రాజధాని ప్రాంతం 7500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తుడటంతో, విజయవాడ లేదా గుంటూరు నగరాల్లోనే హైకోర్టును ఏర్పాటు చేయనున్నట్లు న్యాయ వర్గాల సమాచారం.
అయితే ఈ విషయమై సీఎం చంద్రబాబు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మేరకు నివేదికను కేంద్ర న్యాయ శాఖ ద్వారా సుప్రీం కోర్టుకు పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించి కేంద్రాన్ని సంప్రదించి హైకోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలుపుతుంది.
అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్ధితులను చూస్తే ఇప్పట్లో హైకోర్టు ఏర్పాటయ్యే ఆలోచన కనపడటం లేదు. దీంతో హైకోర్టు తీర్పు మేరకు సర్క్యూట్ బెంచిలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రం హైకోర్టును సంప్రదిస్తే బాగుంటుందని ఆంధ్రాకు ప్రాంత న్యాయవాదులు భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూట్స్ విభాగాన్ని పటిష్ఠం చేసింది. 37 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, 8 మంది అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గ్రేడ్-2లను నియమించారు. రాష్ట్రప్రభుత్వం సివిల్ కోర్టుల చట్టానికి సవరణ చేసి జూనియర్ సివిల్ కోర్టులు 15 లక్షల రూపాయల వరకు ఆర్ధిక వ్యవహారాలపై వచ్చిన అభియోగాలపై విచారించే అధికారాన్ని కల్పించింది.
అంతేకాదు, లోక్ అదాలత్ ద్వారా 1,18,382 కేసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ పరిష్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 7861 కుటుంబ తగాదాలు, లేబర్ తగాదాల కేసులను పరిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వివిధ చట్టాలు రూపొందించేందుకు రాష్ట్ర స్ధాయి లా కమిషన్ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సభ్యులు మూడేళ్లపాటు విధులను నిర్వహిస్తారు.