అద్వానీకి బాధ, సోనియా మాటేంటి:నాకే తెలుసని బాబు
న్యూఢిల్లీ: లోకసభలో జరిగిన ఘటనపై భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ సహా అందరు బాధపడుతుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు ఎందుకు పెదవి విప్పటం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో జరిగిన ఘటనకు సోనియానే బాధ్యులన్నారు.
లోకసభలో జరిగిన సంఘటన ఏమాత్రం సరైంది కాదని, ఏం జరుగుతోంది, ఎక్కడకు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులకు బాధ్యులెవరని ప్రశ్నించారు. పరిష్కారం కోసం ఇరు ప్రాంతాల నేతలతో ఎందుకు చర్చించలేదన్నారు. సొంత పార్టీ మంత్రులు, ఎంపీలు వెల్లోకి వచ్చినా మొండిగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కాంగ్రెసు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, జివోఎంలో వేరే రాష్ట్రం వారు ఉన్నారన్నారు.
సోనియా తీరును ఖండిస్తున్నామని చెప్పారు. సోనియా ఎలా చెబితే కాంగ్రెసు నేతలు అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కూర్చొని ఎపిపై మాట్లాడటమేమిటన్నారు. ఈ రోజు జరిగిన ఘటనపై ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతోందన్నారు. ఆరేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారన్నారు. సున్నిత సమస్యను జఠిలం చేయవద్దని మొదటి నుండి కోరుతున్నామన్నారు.
అఖిల పక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ముందు ప్రశాంతత నెలకొల్పాలని ఆ తర్వాతే సమస్యపై ముందుకెళ్లాలని తాను మొదటి నుండి చెబుతున్నానన్నారు. మోదుగుల మైక్ తీసుకుంటే నైఫ్ అంటూ కమల్ నాథ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లోకసభ స్పీకర్ ప్రవర్తన చాలా బాధాకరమన్నారు. హైదరాబాదును తాను అభివృద్ధి చేశానని, తాను ఎక్కడెక్కడో తిరిగి అభివృద్ధి చేశానని, బాధ తనకు తెలుసునన్నారు.
కాంగ్రెసు పార్టీ తీరు సిగ్గుపడే విధంగా ఉందన్నారు. వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీశారన్నారు. బిల్లు విషయంలో మొదటి నుండి కాంగ్రెసు పార్టీ రహస్యాన్ని పాటిస్తోందని ఆరోపించారు. సున్నిత సమస్యను జఠిలం చేయవద్దన్నారు. కొనకళ్ల నారాయణకు వైద్య పరీక్షలు అందుతున్నాయని తెలిపారు.
కాగా, లగగడపాటి రాజగోపాల్ పైన టిటిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్లు మండిపడ్డారు. పెప్పర్ స్ప్రేతో వచ్చినందున వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలన్నారు. లగడపాటి పైన అనర్హత వేటు వేయాలన్నారు.