జగన్, చంద్రబాబులు నో: పవన్ కల్యాణ్ వెనుక పొట్లూరి?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కొత్త పార్టీ ఆలోచన వెనుక ఎవరు ఉన్నారంటే.. పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పవన్ పార్టీ ఆలోచన వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరు వరప్రసాద్ ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
విజయవాడ నుంచి పార్లమెంటుకు వెళ్లాలని పొట్లూరి వరప్రసాద్ కోరుకుంటున్నారట. అందుకోసం ఆయన పలు ప్రయత్నాలు చేశారంటారు. తొలుత ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. విజయవాడ సీటుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి పొట్లూరికి హామీ రాలేదని, అందుకే ఆయన ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారంటారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతోను విజయవాడ టిక్కెట్ పైన చర్చలు జరిపారట. విజయవాడకు చెందిన కొంతమంది తెలుగుదేశం నేతలతో కలసి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. పార్టీలో చేరతానని, విజయవాడ ఎంపీ సీటు ఇప్పించాలని కోరారట. అప్పటికే టిక్కెట్ మరొకరికి ఇవ్వడం, కేసులు తదితర అంశాల నేపథ్యంలో టిడిపి నుండి చక్కెదురయిందని ప్రచారం జరిగింది.
వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల దారులు మూసుకుపోవడంతో... కాంగ్రెసు పార్టీ వైపు చూసినప్పటికీ, ఆ పార్టీ సీమాంధ్రలో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పొట్లూరి... పవన్ కల్యాణ్ వైపు చూసి ఉండవచ్చునని అంటున్నారు. రాజకీయాలు, సమాజ సేవపై తనవైన ఆలోచనలున్న పవన్ ద్వారా తన లక్ష్యం సాధించాలని పొట్లూరి తలపోసినట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇందుకు ఆర్థికంగా కూడా ఆయన సాయం అందించేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
సినీ పరిశ్రమతో పొట్లూరికి బాగానే సంబంధాలు ఉన్నాయి. తన పరిచయాలను ఆసరా చేసుకునే పవన్కు సన్నిహితుడిగా మారి... ఆయన్ను పార్టీ దిశగా నడిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా పవన్తో పార్టీ పెట్టించి, విజయవాడ ఎంపీ సీటు సాధించుకోవాలని పొట్లూరి భావిస్తున్నారట.
అయితే, కేవలం విజయవాడ సీటు కోసం పవన్ కల్యాణ్ పక్కన చేరి పార్టీ పెట్టించాల్సిన అవసరమేముందని, అంతగా ఆసక్తి ఉంటే స్వతంత్రంగా దిగే అవకాశాలు ఉన్నాయని, పవన్ వెనుక పొట్లూరి ఉన్నారనే విషయంలో వాస్తవం ఉండకపోవచ్చుననే వారు కూడా లేకపోలేదు.