హోటల్లో జగన్తో ఎవరో భేటీ: అనురాధ, ఏసీబీకి రిపోర్ట్, నేడో రేపో బాబుకు నోటీస్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మే 21వ తేదీన హోటల్లో ఎవరితో భేటీ అయ్యారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత అనురాధ బుధవారం నాడు ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ షాడో అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
మే 21న బంజారాహిల్స్లోని రోడ్డు నెంబర్ 12లోని సితార హోటల్లో జగన్ ఎవరిని కలిశారు, ఏం కుట్రలు చేశారో త్వరలో వివరాలు బయటపెడతామని చెప్పారు. సెక్షన్ 8 గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సెక్షన్ 8 అమలు చేయకుంటే తానే నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
ఇద్దరు సీఎంలు దోషులే: రఘువీరా
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు దోషులేనని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాఫ్తు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకం తమకు ఏమాత్రం లేదన్నారు. ఈ కేసులపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. సెక్షన్ 8 అమలు బాధ్యత గవర్నర్దే అన్నారు.
సెక్షన్ 8 అమలు చేయాల్సిందే: శిద్ధా
సెక్షన్ 8ను ఎట్టి పరిస్థితుల్లోను అమలు చేయాల్సిందేనని మంత్రి శిద్ధా రాఘవ రావు అన్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం తగదన్నారు. హైదరాబాదును యూటీ చేస్తేనే రక్షణ ఉంటుందని ఏపీ లాయర్ల జేఏసీ అభిప్రాయపడింది.
చంద్రబాబుకు ఇవాళో, రేపో నోటీసులు?
ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్తో ఫోన్లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్ధారించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్టీఫెన్ సన్ మొబైల్ను పరిశీలించారు. సాయంత్రంలోపు ఏసీబీ చేతికి సమగ్ర నివేదిక అందనుందని తెలుస్తోంది.
ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో చంద్రబాబుకు షాక్ తగలనుందని వార్తలు వస్తున్నాయి. నేడో, రేపో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల సీఈవోలకు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని, ఏసీబీ నుంచి పలువురు రాజ్యసభ సభ్యులు కూడా నోటీసులు అందుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.