సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు కూటమి అభ్యర్ధి ఖరారు..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ కీలక పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామా తో టీడీపీ నుంచి ఇద్దరు.. బీజేపీ నుంచి ఒక సభ్యుడితో భర్తీ చేసారు. ఇప్పుడు విజయ సాయిరెడ్డి రాజీనామా చేసారు. ఈ సీటు కూటమికే దక్కనుంది. అయితే, కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్ధి ఎవరు. మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఈ స్థానం దక్కతుంది.. ఎవరిని పెద్దల సభకు పంపుతారనేది ఆసక్తి కరంగా మారింది.
కూటమి నుంచి దక్కేదెవరికి
ఏపీ లో మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది. మూడు పార్టీల అంగీకారంతోనే ఏ నిర్ణయం అయినా అమలు చేస్తున్నారు. కానీ, రాజ్యసభ విషయంలో మాత్రం బీజేపీ పట్టు బిగించింది. ఏపీ విషయంలో తాము పట్టువిడుపులతో ఉంటామని.. పార్లమెంట్ అంశంలో మాత్రం తమ పార్టీకే ప్రాధాన్యత ఉండాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. తొలుత మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా.. చివరకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్ధనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేసారు. ఫలితంగా టీడీపీ రెండు.. బీజేపీ కి ఒక సీటు దక్కాయి.

బీజేపీ ఖాతాలో
ఇప్పుడు విజయ సాయిరెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కనుంది. అయితే, ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనాతో ఉన్నారు. కానీ, సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు, పవన్ కు స్పష్టం చేసి నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వస్తోంది. వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు. తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు. ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన సాయిరెడ్డి రాజీనామాతో అదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. కొత్త అభ్యర్ధి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది.

సీమ ప్రాంతానికే
బీజేపీ ఈ సీటు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. బీసీ వర్గానికి చెందిన ఆర్ క్రిష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపినా.. తెలంగాణ లో ఆయన సేవలు వినియోగించుకోనుంది. అదే విధంగా ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో కిరణ్ రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒక దశలో కిరణ్ ను ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. టీడీపీ- జనసేన తో బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీలు ప్రధానంగా రెండు వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. దీంతో, రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ను ఖాయం చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. వచ్చే వారం రాజ్యసభ అభ్యర్ధి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications