ఉద్యోగులు తొందర పడ్డారా- పంతానికి పోతున్నారా : సీఎం జగన్ ధీమా అదే : అక్కడే అసలు గ్యాప్..!!
ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు నోటీసు ఇచ్చారు. పీఆర్సీ పైన చర్చల్లో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగా జీవోలు లేవంటూ ఆందోళనకు దిగారు. ఫిట్ మెంట్ 23 శాతం ఇస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల సమక్షంలోనే ప్రకటించారు. పెండింగ్ డీఏలను ఈ నెల నుంచే చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. అడగకుండానే పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రకటన చేసారు. అది ఎంత వరకు ఉద్యోగులకు మేలు చేస్తుందనే అంశం పక్కన బెడితే ఆ రోజున అందరూ స్వాగతించారు. అయితే, హెచ్ఆర్ఏ నిర్ణయం.. మూడు విధాలుగా పీఆర్సీ అమల్లో అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులు... సీఎస్ కమిటీ నివేదిక... కేంద్ర పీఆర్సీ విధానాల నుంచి ప్రభుత్వానికి మేలు చేసేవి ఎంపిక చేసుకొని.. రాష్ట్రంలో అమలు చేసే విధంగా ఉద్యోగులకు నష్టం జరిగేలా జీవోలు జారీ చేసారనేది ఉద్యోగ సంఘాల వాదన.
ఉద్యోగులు పంతానికి పోతున్నారా
దీంతో.. జీవోల జారీతో ఒక్క సారిగా ఉద్యోగ సంఘాలు తమ మధ్య ఉన్న విభేదాలు మరించి ఒక్కటయ్యాయి. సమ్మెకు సిద్దమయ్యాయి. నిర్ణయించిన విధంగానే సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నాయి. అయితే, ఇదే సమయంలో ప్రభుత్వం సైతం తమ వ్యహాలకు పదును పెట్టింది. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు..కరోనా వేళ జీతాల భారం ఎంత మేర చెల్లిస్తుందీ వివరించే విధంగా అడుగులు వేస్తోంది. కరోనా వేళ ఉద్యోగులు సమ్మెకు వెళ్లటం పైన ప్రజల్లో చర్చ జరిగేలా వ్యవహరిస్తోంది. ఉద్యోగులతో వారి అపోహలు తొలిగించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీ నియమించింది. కానీ, ఆ కమిటీ ముందుకు వెళ్లేందుకు వరుసగా రెండో రోజు తిరస్కరించారు.
ప్రభుత్వం చర్చలకు పిలిచినా..
ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చినా...సమ్మెకు దిగినా... ఎన్ని రోజులు చేసినా..చివరకు పరిష్కారం కావాల్సింది ప్రభుత్వంతోనే. అదే ప్రభుత్వం పదే పదే చర్చలకు ఆహ్వానించిన సమయంలో వెళ్లి తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ, దానిని వదులుకోవటం ద్వారా ఉద్యోగ సంఘాల పైన ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయనే చర్చ సాగుతోంది. ఏపీలో నిత్యం 13 వేల కు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆర్దికంగా కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో సమ్మె ప్రారంభిస్తారా... దిగినా ఎన్ని రోజులు కొనసాగిస్తారు.. ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందనేది ఆసక్త కర అంశాలుగా మారుతున్నాయి. ఇదే సమయంలో తమ కు ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
చిరవకు పరిష్కారం ప్రభుత్వం వద్దనే..
కానీ, ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలకు చెందిన మాజీ ఉద్యోగ సంఘాల నేతలు వీరిని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతల ట్రాప్ లో వీరు చిక్కుకున్నారనేది వారి అంతర్గత సంభాషణల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయం. కానీ, సీఎం జగన్ మాత్రం ఉద్యోగులు ఆందోళన చేసినా వారి పైన ఎటువంటి చర్యలు వద్దని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఒత్తిడికి లొంగే అవకాశం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో వార్డు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత.. ఆన్ లైన్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుతున్న సమయంలో ఉద్యోగులు సమ్మె చేస్తే.. ప్రభుత్వం పైన ఏ మేర ప్రభావం ఉంటుందనేది వేచి చూడాల్సిన అంశం. ఖచ్చితంగా ఉద్యోగులు సమ్మె చేస్తే ఆ ప్రభావం ఉన్నా.. ప్రభుత్వం సైతం ఇదే సమ్మెకు దిగటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే సమస్య జిఠిలం అయ్యే పరిస్థితులు ఏర్పడుతాయని కొందరు విశ్లేషిస్తున్నారు.
గత సమ్మెల ముగింపు గుర్తు చేస్తూ
ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చినా.. చర్చలకు వెళ్లటం సరైన విధానంగా సూచిస్తున్నారు. గతంలో కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమ ఓట్ల బలం.. ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటుందనే విధంగా చేసిన వ్యాఖ్యలతోనే వారి ధీమా ఏంటనేది స్పష్టం అయిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో తెలంగాణలో.. గతంలో సమైక్య రాష్ట్రం కోసం చేసిన సమ్మె ముగింపు సందర్భాలను సైతం వారు ప్రస్తావిస్తున్నారు. చర్చల సమయంలో కొన్ని ఉద్యోగుల అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు.. జీవోల జారీ తరువాత ఉద్యోగులకు భారీ నష్టం జరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. జీతాలు తగ్గవని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో వాస్తవం ఉన్నా... వారికి దక్కాల్సిన ప్రయోజనాలు నష్టపోతున్నామనే ఉద్యోగుల వాదనలోనూ నిజం ఉంది.
Recommended Video
పరిష్కారం దొరికేదెలా... ఎన్నాళ్లిలా
దీనికి చర్చల ద్వారానే పరిష్కారం లభించాలి. కానీ, రెండు పక్షాల వైపు రాజకీయ పార్టీల తరహాలో వ్యూహాలు..పంతాలు..పట్టింపులకు వెళ్లటం ద్వారా రాష్ట్రానికి మరింత నష్టం తప్పదనే అభిప్రాయం ఉండవల్లి లాంటి వారు వ్యక్తం చేస్తున్నారు. రెండవ రోజు మంత్రులు సచివాలయంలో ఉద్యోగుల కోసం వేచి చూడటం.. ఉద్యోగులు చర్చలకు వెళ్లకపోవటం..జీవోలను రద్దు చేస్తనే వెళ్తామని చెప్పటం..లేఖ ద్వారా తమ అభిప్రాయం చెప్పటం..ఇటువంటి వాటి ద్వారా సమస్య జటిలం అవుతుందని భావిస్తున్న వారు ఉన్నారు. దీంతో...ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా లభిస్తుందనేది వేచి చూడాల్సిందే.