మీ మధ్య ఏముందో?: జగన్, కెసిఆర్లకు నారా లోకేష్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఒకరినొకరు ఎందుకు విమర్శించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆ రెండు పార్టీల నాయకులు విమర్శలు చేసుకోకపోవడానికి ఏమైనా బంధముందా అని అభిప్రాయపడ్డారు.
'అటు జగన్.. ఇటు మనం..' అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అన్నట్లుగా ప్రచురితమైన వార్తాపత్రిక క్లిప్పింగ్ను కూడా నారా లోకేష్ తన ట్వీట్కు యాడ్ చేశారు. అటు వైయస్సార్ కాంగ్రెసు, ఇటు తెరాసలు ఒక పార్టీని మరో పార్టీ పల్లెత్తు మాట కూడా అనుకోవని, ఈ రెండు కాంగ్రెసు పార్టీ ఆడిస్తున్న ఆటలో భాగస్వాములు కనుక అని దానిపై పేర్కొన్నారు.
టిడిపిదే గెలుపు: కెఈ
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయని టిడిపి సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి ఆదివారం ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు పాతనగరంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి కాంగ్రెసు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి జగన్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
టిడిపితోనే అభివృద్ధి: నాని
తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమానికి పాటుపడేది తమ పార్టీనే అని ఆ పార్టీ నేత కేశినేని నాని అన్నారు. విజయవాడలోని టిడిపి కార్యాలయంలో ముస్లింల ఆత్మీయ సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ముస్లింలకు కనీస సౌకర్యాలు టిడిపి ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు.