బాబూ! దాచిపెట్టేలా ఏం తప్పు చేశావ్?: నరేంద్ర మోడీ, 'బీజేపీకి 300 సీట్లు ఖాయం'
న్యూఢిల్లీ: 'నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, రిమెట్ కంట్రోల్ లీడర్స్ నన్ను టార్గెట్ చేశారు. చివరకు అమిత్ భాయ్ (అమిత్ షా)ను జైలుకు కూడా పంపించారు. కానీ అలాంటి పరిస్థితుల్లోను తాము సీబీఐని (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రాష్ట్రంలోకి రాకుండా నిర్ణయాలు తీసుకోలేదు.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... 'కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు సీబీఐ అధికారులు రావొద్దని ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి? అసలు వారు ఏమి దాస్తున్నారు?' అని వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ జాతీయ సమ్మేళనం చివరి రోజు సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడారు.
మీరు సచ్ఛీలురా, ఏం దాస్తున్నారు.. బాబు-మమతలపై మోడీ ఆగ్రహం
ఈ సందర్భంగా మోడీ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సీబీఐ అధికారులను అనుమతించని అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీలు తమ రాష్ట్రాల్లోకి సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించారని, అంత భయపడేంత తప్పు వారు ఏం చేశారని మోడీ ప్రశ్నించారు. రేపు మిగతా కేంద్ర సంస్థలను రానీయబోమని చెబుతారని, సైన్యం, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం, కాగ్.. ఇలా ప్రతి ఒక్కటి వారి దృష్టిలో తప్పుడు సంస్థలేనా అని ప్రశ్నించారు. వారు మాత్రమే సచ్ఛీలురా అని ధ్వజమెత్తారు.
అప్పుడు కూడా నేను సీబీఐని అడ్డుకోలేదు
ఇదే సమయంలో మోడీ గుజరాత్లో తాను సీఎంగా ఉన్నప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రిమోట్ కంట్రోల్ లీడర్స్ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. వారు అమిత్ షాను జైల్లో కూడా పెట్టారన్నారు. తనను సుదీర్ఘంగా విచారించారని చెప్పారు. కానీ తాము అలాంటప్పుడు కూడా సీబీఐకి నో చెప్పలేదని అన్నారు. దేశ చరిత్రలో అవినీతి అంటని తొలి కేంద్ర ప్రభుత్వంగా తమ ప్రభుత్వం నిలిచిందని మోడీ అన్నారు. అవినీతికి తావులేకుండా దేశాన్ని నడపవచ్చునని బీజేపీ నిరూపించిందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్ను తీసుకొచ్చామన్నారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలో కలుస్తున్నాయి
జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న మహాకూటమి ఒక విఫల ప్రయత్నమని మోడీ అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని పెంచి పోషించే బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే దాని లక్ష్యమన్నారు. అయోధ్యలో రామాలయ సమస్యకు పరిష్కారం కనుగొనడం కాంగ్రెస్ పార్టీకి సుతరామూ ఇష్టం లేదనీ, తన న్యాయవాదుల ద్వారా దీన్ని అడ్డుకుంటోందన్నారు. భావసారూప్యతను బట్టి రాజకీయ పార్టీలు కలవడం సాధారణమని, కానీ కాంగ్రెస్కూ, దాని సంస్కృతికి విరుద్ధంగా పుట్టిన పార్టీలే ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలుపుతున్నాయని టీడీపీ తదితర పార్టీలను ఉద్దేశించి అన్నారు. తనను కుర్చీలోంచి దించేయాలన్న ఏకైక లక్ష్యంతోనే అవి కలుస్తున్నాయని, దృఢమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అవినీతిని అంతం చేయవచ్చని తాము భావిస్తున్నామని, విపక్షాలు మాత్రం తమ దుకాణాలు ఎక్కడ మూతపడిపోతాయోనని భయపడుతున్నాయని, అవినీతికి వంతపాడే బలహీనమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశంతో ఒక్కటవుతున్నాయని, తమ ప్రభుత్వం వస్తే బంధువులకు మేలు చేసుకోవచ్చన్నది వాటి ఆలోచన అన్నారు. అందుకే వారు అందరం కలుద్దాం... అందరం వికసిద్దామని చెబుతున్నారన్నారు.
బీజేపీకి 300 సీట్లకంటే ఎక్కువ
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. మహాకూటమికి నాయకులుగా ఎవరు ఉంటారని, బెంగాల్ దీదీయా, ఆంధ్రప్రదేశ్ బాబూనా, యూపీ బెహన్ జీనా అని మమతా బెనర్జీ, చంద్రబాబు, మాయావతిలని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ... వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.