పెనం నుండి పొయ్యిలోకి, బిజెపి నేతలు కేంద్రాన్ని నిలదీయాలి: బాబు షాకింగ్ కామెంట్స్
అమరావతి: రాష్ట్రం పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడినట్టుగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.కేంద్రం నుండి ఏపీ రావాల్సిన నిధుల విషయంలో అన్ని పార్టీలను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్రం నుండి మూడేళ్ళుగా అరకొర సహయం మాత్రమే అందినా బిజెపి నేతలు అన్ని చేశామని ప్రకటనలిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Recommended Video
టిడిపి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం నాడు అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో జరిగింది.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఏ రకంగా రాష్ట్రానికి నిధులను రాబట్టాలనే దానిపై ఈ సమావేశంలో పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తులు, వ్యూహలపై కూడ చర్చించినట్టు సమాచారం.
పవన్ ఎఫెక్ట్: దిగొచ్చిన కేంద్రం, ఫిబ్రవరి 23న, ఢిల్లీకి రావాలని ఆహ్వనం
మూడేళ్ళుగా ఏపీకి అరకొర సాయమే
ఏపీ రాష్ట్రానికి మూడేళ్ళుగా అరకొర సహయమే అందిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి నిధులు రాకున్నా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేశామని చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాల్సిందేనని చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో పార్టీ నేతలతో చెప్పారు. కేంద్రం నుండి అంతంత మాత్రంగానే సహయం వచ్చినా రాష్ట్ర అభివృద్దిలో రాజీపడలేదని బాబు గుర్తు చేశారు.
ఢిల్లీని నిలదీయకుండా బిజెపి నేతలు టిడిపిని ప్రశ్నిస్తున్నారు
మూడేళ్ళుగా ఏపీ రాష్ట్రానికి అరకొర నిధులే కేటాయించడంపై బిజెపి నేతల తీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీకి అన్ని రకాల నిదులను ఇచ్చామంటూ బిజెపి నేతలు కూడ ఈ మధ్య ప్రకటనలు ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను ఏం చేశారంటూ మనల్ని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబునాయుడు పార్టీ నేతల సమావేశంలో బిజెపి నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో బిజెపి నేతలు కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్రంపై ప్రకటనలు గుప్పించడంపై బాబు అసహనాన్ని వ్యక్తం చేశారు.
''పవన్ కళ్యాణ్ వల్లే పబ్లిసిటీ'', ''ఏం జరుగుతుందో చూద్దాం''
అన్ని పార్టీలను కూడగట్టి పోరాటం
రాష్ట్రానికి నిధుల విషయంలో అన్ని పార్టీలను కూడగట్టి పోరాటం చేయనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి సమన్వయకమిటీ సమావేశంలో ప్రకటించారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. అన్ని పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడితెస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రయోజనం దక్కుతోందన్నారు.రాష్ట్రానికి న్యాయం జరగకూడదనే వైసీపీ చీఫ్ జగన్ వ్యూహంగా కన్పిస్తోందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
పెనం నుండి పొయ్యిలో పడ్డాం
రాష్ట్ర పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడినట్టుగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు నిరసన కార్యక్రమాలకు తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ నేత ఆజాద్ ప్రకటించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. ఇప్పుడేమో కేంద్రంపై అవిశ్వాసం పెడతామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారని బాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు.