కాపు కార్డ్: బాబు అంటే మోడీకిష్టం, టిడిపి ఝలక్తో బిజెపి కార్నర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్రమంత్రులు, బిజెపి నేతలు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ శనివారం నాడు ప్రశంసలు కురిపించారు. దీని వెనుక... కాపు రిజర్వేషన్ల పైన చంద్రబాబు బిజెపిని కార్నర్ చేయడమే కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు పైన వెంకయ్య గతంలోను ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా గడ్కరీ... ఏపీ సీఎంను మెచ్చుకున్నారు. అదే సమయంలో ఇటీవలి కాలంలో టిడిపి పైన గుర్రుమనే బిజెపి నేతలు చల్లబడ్డారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు టిడిపి పైన గతంలో తీవ్రంగా మండిపడ్డారు.
ఇటీవలి కాలంలో వారు టిడిపి పైన గతంలోలా మండిపడటం లేదు. అదే సమయంలో వెంకయ్య, గడ్కరీలు చంద్రబాబును ఆకాశానికెత్తారు. దానికి, చంద్రబాబు కాపు కార్డుతో బిజెపిని కార్నర్ చేయడమేననే వాదనలు వినిపిస్తున్నాయి.
శనివారం వెంకయ్య మాటలాడుతూ... సీఎం చంద్రబాబు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న వాడని, అందుకే ప్రధాని మోడీకి ఆయన అంటే ఇష్టమని కితాబిచ్చారు. గడ్కరీ మాట్లాడుతూ... చంద్రబాబు కేంద్రానికి మంచి స్నేహితుడు అన్నారు. అతను బిజెపితో ఎప్పుడు సత్సంబంధాలు కలిగి ఉంటాడని చెప్పారు.
మొదట.. బీహార్ ఎన్నికల ప్రభావం ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా బిజెపికి ఇటీవల వరుస షాకులు తగులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టిడిపిని దూరం చేసుకోకపోవడమే మంచిదని బిజెపి నేతలు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే వారి వైఖరిలో మార్పు వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, కాపు రిజర్వేషన్ల అంశం మరో కారణంగా చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి... జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారంతో కూడా గట్టెక్కారని చెప్పవచ్చు. టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపు వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగా కాపులకు ఇచ్చిన హామీ మేరకు... కాపు రిజర్వేషన్ల అంశంపై కదులుతోంది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. తద్వారా చంద్రబాబు కాపు సామాజిక వర్గం నుంచి ఎంతోకొంత అనుకూలతను సంపాదించుకున్నారని చెప్పవచ్చు.
మొన్నటి వరకు.. పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని బిజెపి భావించింది. ఇప్పుడు చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేస్తుండటం కమలదళానికి మింగుడుపడనిదిగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా కనిపించడం లేదు. పైగా ఇటీవల ఆయనను కలిసి మెచ్చుకున్నారు.
దానికి తోడు కమిటీ ఏర్పాటు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న బిజెపి ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కాపు కమిషన్ లేదా కాపు కార్పోరేషన్ పైన వీర్రాజు కూడా ఇప్పటి వరకు మౌనం పాటిస్తున్నారు.