రైతుల కన్నీళ్లు మంచిది కాదు, రాజధాని అన్నదాతలను బాధపెట్టొద్దు, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ
రాజధాని మార్పుపై ఊహాగానాలు నెలకొంటున్న నేపథ్యంలో విమర్శలకు విపక్షాలు మరింత పదునుపెడుతున్నాయి. రాజధాని మార్చడం కన్నా ఒక్కో రంగాన్ని ఒక్కో హబ్గా చేయాలనే సూచనలు వస్తున్నాయి. జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ కూడా రాజధాని మార్చడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం మారితే రాజధాని మారుస్తామని పేర్కొనడం సరికాదని సూచించారు.
రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ ముఖ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ ముఖ్యమని చెప్పారు. ఇదివరకు హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతమైందని గుర్తుచేశారు. మిగతా నగరాలు అభివృద్ధి జరగకపోవడం శాపంగా మారిందని చెప్పారు. తమిళనాడు, మహారాష్ట్రలో ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో రంగానికి హబ్గా మారుస్తున్నారని.. ఏపీలో కూడా అదే విధానాన్ని అవలంభించాలని సూచించారు.
శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రైతులను ఏడిపించడం మంచిది కాదని, రైతుల కన్నీళ్లు రాష్ట్రానికి.. దేశానికి మంచిది కాదన్నారు.
జీఎన్ రావు కమిటీ ప్రతిపాదనపై ఏపీ భగ్గుమంటోన్న నేపథ్యంలో.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారబోతున్న విశాఖపట్టణానికి 394.50 కోట్లు విడుదల చేసింది. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం ఏడు జీవోలు విడుదల చేసింది. అమరావతి రాజధాని మార్చొద్దని రాజధాని రైతులు కోరుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.