బాబు ఆ విషయాన్ని మరిచిపోయారా! : ఆయన రానన్నారా? అసలు ప్రయత్నించలేదా?
విజయవాడ : హైటెక్ బాబుగా ముద్రపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు.. తన కలల నగరం సింగపూర్ గురించి ఎంతగా కలవరిస్తారన్నది అందరికీ తెలిసిన అంశమే. వేదికల మీద, ప్రెస్ మీట్స్ లో.. ఇలా సందర్బం వచ్చిన ప్రతీసారి నవ్యాంధ్ర రాజధానిని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దుతానని చెప్పడం ఆయనకు అలవాటు. అందుకు తగ్గట్టే.. కొత్త రాజధానిని నిర్మించే బాధ్యత సింగపూర్ కంపెనీల చేతుల్లో పెట్టారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఏపీ రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం గురించి ఆ దేశ ప్రధానితోను పలుమార్లు మాట్లాడిన చంద్రబాబు ఆయన్ను అమరావతికి రావాలని కూడా ఆహ్వానించారు. సింగపూర్ నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత సింగపూర్ ప్రధాని అమరావతి వస్తున్నారని కూడా చాలా సందర్బాల్లో చెప్పారు. అయితే ఇంతవరకు ఆయన అమరావతి సందర్శనం లేకపోగా.. ప్రస్తుతం సింగపూర్ ప్రధాని పర్యటన ఇండియాలో కొనసాగుతోన్న నేపథ్యంలోను దాని ఊసు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోన్న విషయం.
సింగపూర్ ప్రధాని గురించి పదే పదే చెప్పే చంద్రబాబు.. ఆయన స్వదేశంలో పర్యటిస్తున్నా.. అమరావతికి ఎందుకు రప్పించలేకపోతున్నారు?, అసలా ప్రయత్నం చేశారా? అన్నది స్పష్టత లేని అంశాలు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రమే ఇండియాలో అడుగుపెట్టిన సింగపూర్ ప్రధాని, ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ను కలవనున్నారు. రాజస్తాన్ లోను ఆయన పర్యటన ఖరారైనట్టుగానే తెలుస్తోంది. మరి అమరావతి పర్యటన మాత్రం ఆయన ఐదురోజుల షెడ్యూల్ లో ఎందుకు లేకపోయిందన్నది ఏపీ సీఎం చంద్రబాబుకే తెలియాలి.
అధికారికంగా అయితే సింగపూర్ ప్రధాని అమరావతిలో పర్యటించే విషయమేది బయటకురాలేదు. ఒకవేళ ఉండుంటే.. మామూలుగానే హంగు ఆర్భాటాలకు పెద్ద పీట వేసే చంద్రబాబు ఈపాటికే ఆ హడావుడి మొదలుపెట్టేవారన్న వాదన కూడా ఉంది. ఇక మరో వాదనేంటంటే.. ఒకవేళ చంద్రబాబు ప్రయత్నించినా.. సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటనకు ఒప్పుకున్నారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా సింగపూర్ ప్రధానిని అమరావతికి రప్పిస్తున్నానని చాలాసార్లు చెప్పుకున్న చంద్రబాబు ప్రస్తుతం ఆయన ఇండియాలోనే పర్యటిస్తున్నా.. అమరావతికి తీసుకురావడంలో విఫలమయ్యారా! దీనికి టీడీపీ నేతలైతేనే సరైన సమాధానం చెప్పగలరేమో!.